తెలంగాణ బీజెపి నేతలకు అమీత్ షా క్లాస్..! తీరు మారకపోతే తీవ్ర పరిణామాలని హెచ్చరికలు..!!
Recommended Video
హైదరాబాద్: కమలదళ నేతలకు ఆగ్రహం వచ్చింది. ప్రాంతీయ నేతల తీరుపై భగ్గుమన్నారు. తీరు మారకపోతే తీవ్ర పరిణామాలని హెచ్చరించారు. బీజేపి జాతీయ అద్యక్షుల వారి ఆగ్రహానికి గురైంది ఎవరో కాదు. మన తెలంగాణ బీజేపి నాయకులే..!తెలంగాణలో కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయాల్పింది పోయి వ్యక్తిగత కారణాలతో వివాదాలు రగిల్చి పార్టీని బలహీన పరచాలని చూస్తే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. అమీత్ షా ఓ పక్క క్లాస్ తీసుకుంటుంటే మరోపక్క కమల తమ్ముళ్లు తమ సందేహాలతో అమీత్ షాను ఉక్కిరి బిక్కిరి చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణ బీజేపి నేతలపై అమీత్ షా ఆగ్రహం..! గ్రూపులు రాజకీయాలెందుకని ప్రశ్న..!!
మీకు ఎన్నిసార్లు చెప్పినా తలకెక్కదా, నేను వచ్చినప్పుడల్లా క్లాసులు పీకాల్సిందేనా, ఇలా అయితే తెలంగాణలో బీజేపీ నిలబడడం కష్టం. అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ కమలనాథులపై మండిపడ్డట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో పార్టీ నాయకులు గ్రూపులు కట్టడంపై అమిత్ షా మండిపడినట్లు చెబుతున్నారు.భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో నిర్వహించిన సమరభేరి సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పార్టీ అధ్యక్షడు అమిత్ షా తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.
అందరూ ఒకటే..! ఎవ్వరూ తోపులు కాదన్న అమీత్ షా..!!
తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికలలో పార్టీ విజయం కోసం పనిచేయకుండా గ్రూపులు కడుతున్నారని తెలంగాణ కమలనాథులపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల బలం ఉందని, నాయకులలో అనైక్యత కారణంగా ఆ బలం మసకబారుతోందని పార్టీ అధిష్టానానికి అందిన సమాచారంగా చెబుతున్నారు. ప్రజలలోను, కార్యకర్తలలోను బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీని తమ పార్టీకి చెందిన అగ్రనాయకులే నాశనం చేస్తున్నారన్నది జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావనగా చెబుతున్నారు.
అమీత్ షా ను నిలదీసిన స్థానిక నేతలు..! ఇదెక్కడి ఆచారం అంటూ నిలదీత.!!
తెలంగాణ పార్టీ నాయకుల మధ్య విబేధాలను తొలగించుకుని అందరూ సమష్టిగా పనిచేయాలని, ఇంతకు ముందు కూడా అమిత్ షా తెలంగాణ కమలనాథులకు హితబోధ చేసారు. అయితే వారెవ్వరూ తాను చెప్పిన మాట వినకుండా గ్రూపులు కడుతూ ఒకరి పరాజయానికి మరొకరు ఎత్తులు వేస్తున్నట్లు అధిష్టానానికి ఉప్పందిందంటున్నారు. ఈ సమాచారం మేరకు అమిత్ షా తెలంగాణ నాయకులతో సమావేశమై తీవ్ర హెచ్చరికలు చేసినట్లు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు కూడా అమిత్ షాపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.
కేంద్రమంత్రులు టీఆర్ఎస్ పొగడటం ఆపాలి..!లేకపోతే మేం జోకర్లమే అంటున్న నాయకులు..!!
తాము తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా మాట్లడుతుంటే కేంద్ర మంత్రులు, పార్టీ నాయకులు మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రకటనలు చేయడంపై అమీత్ షా ను నిలదీసినట్టు తెలుస్తోంది. దీనివల్ల రాష్ట్రంలో తమ విమర్శలు కామెడీ అవుతున్నాయని వాపోయారు. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో ప్రశంసిస్తుంటే తమ విమర్శలకు విలువే ఉండటం లేదని అమిత్షా ముందు ఆవేదనను వెలిబుచ్చారు కమల నేతలు. అయితే ఇవన్నీ అభూత కల్పనలని, ఇతర పార్టీలలాగే తెలంగాణ రాష్ట్ర సమితి కూడా తమకు ప్రత్యర్దే అని కమల దళపతి రాష్ట్ర నాయకులకు మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. రానున్న తెలంగాణ ముందస్తు ఎన్నికలలో బాజపా నాయకులందరూ కలసి కట్టుగా పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమిత్ షా తెలంగాణ నాయకులను హెచ్చరించినట్లు తెలుస్తోంది.