లడాయి మొదలైంది: కాంగ్రెస్, కేసీఆర్ను ఏకేసిన అమిత్ షా
మహబూబ్నగర్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహబూబ్నగర్లో జరిగిన బహిరంగసభలో అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించారు.
ముందస్తు అందుకేనా? మజ్లిస్కు భయపడి..: కేసీఆర్పై అమిత్ షా నిప్పులు
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ జమిలి ఎన్నికల వెళదామన్న పిలుపునకు కేసీఆర్ మొదట అంగీకరించారని, అయితే ఆ తర్వాత ముందస్తుకు వెళ్లారని అన్నారు. జమిలిపై కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. దీంతో ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతుందని అన్నారు.
ఎంఐఎంకు భయపడే కేసీఆర్ వేడుకలు జరపడం లేదు
దేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే తెలంగాణకు మాత్రం సెప్టెంబర్ 17, 1948లో వచ్చిందని అమిత్ షా గుర్తు చేశారు. నిజాం-రజాకార్ల పాలన కారణంగా తెలంగాణకు ఏడాది ఆలస్యంగా స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. సెప్టెంబర్ 17న కూడా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవాల్సి ఉండగా.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ సర్కారు జరపడం లేదని మండిపడ్డారు. ఎంఐఎంకు భయపడే వేడుకలు చేయలేకపోతున్నారని విమర్శించారు. నిజాం పాలనలోని ఇతర ప్రాంతాల్లో సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని నిర్వహిస్తుండగా, ఇక్కడ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్.. ఓవైసీకి భయపడుతున్నారని అన్నారు.
లడాయి మొదలైంది
వచ్చే మేలో జరిగే ఎన్నికల్లో గెలువలేని కేసీఆర్.. ముందుకు వెళ్లి డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని అమిత్ షా నిలదీశారు. తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ లడాయి మొదలైందన్నారు. 2014 తర్వాత దేశంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిందని అన్నారు. మాజీ ప్రధాని పీవీకి సరైన గౌరవం ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీపై అమిత్ సా మండిపడ్డారు. అలాంటి పార్టీకి చెందిన రాహుల్ ఇక్కడికి ఎలా వస్తారని అన్నారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కేసీఆర్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 50శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వకూడదని తెలిసినా.. ఇలాంటి హామీలిస్తారా? అని మండిపడ్డారు. ఆ రిజర్వేషన్లు ఇస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నష్ట జరుగుతుందని అన్నారు.
కేసీఆర్ అలా ఎందుకు చేయడం లేదు?
దేశంలో అక్రమంగా చొరబడే విదేశీయులను దేశం నుంచి తరిమికొట్టాలని, అది బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. హైదరాబాద్ తోపాటు తెలంగాణలో బంగ్లాదేశీయులు అక్రమంగా ఉంటున్నప్పటికీ కేసీఆర్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. వారిని ఎందుకు వెళ్లగొట్టడం లేదని అమిత్ షా ప్రశ్నించారు. దళిత సీఎం అని కేసీఆర్ మోసం చేశారని అమిత్ షా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వస్తే రైతులకు, దళితులకు, అన్ని వర్గాలకు అండగా ఉంటుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చిందని అన్నారు. కేసీఆర్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని మండిపడ్డారు.
తెలంగాణకు కేంద్రం అండ
ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇ,చ్చిన నిధులు, అభివృద్ధి పథకాలను అమిత్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న సమయంలో ఎప్పుడూ మన ఆర్మీపైనే దాడులు జరిగేవని.. మోడీ ప్రభుత్వం వచ్చాక ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోందని అన్నారు. ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగిందని అన్నారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు సర్జికల్ స్ట్రైక్స్ కూడా మోడీ ప్రభుత్వం చేసిందని అన్నారు.
బీజేపీని గెలిపించండి..
దేశం, రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీని గెలిపించాలని అమిత్ షా అన్నారు. మరోసారి కేంద్రంలో బీజేపీని గెలిపించాలని అన్నారు. కమలం గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. భారత్ మాతాకీ జై అంటూ అమిత్ షా తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సభలో బండారు దత్తాత్రేయ, మురళీధర్ రావు, లక్ష్మణ్, కిషన్ రెడ్డి, రాజా సింగ్, ఎన్వీఎస్ ప్రభాకర్, రామచంద్రారెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.