సైనా, రామోజీరావులతో అమిత్ షా భేటీ: 'మీ ఆవేదన నాకు తెలుసు కానీ'
Recommended Video
హైదరాబాద్: సంపర్క్ ఫర్ సమర్థన్లో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ఈనాడు అధినేత రామోజీ రావులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత నాలుగేళ్లుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి వివరించారు. భేటీ సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు ఉన్నారు.
నగరానికి వచ్చిన అమిత్ షా అంతకుముందు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిటీతో సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి ఫిల్మ్ సిటీకి వెళ్లారు. సైనా నెహ్వాల్ను ఆమె ఇంట్లో కలిశారు. బీజేపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పుస్తకాన్ని అందించారు. సైనా మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా బీజేపీ దేశాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్తోందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.
ఇరువురి ట్వీట్లు
అనంతరం అమిత్ షా, సైనాలు ట్విట్టర్లలో ట్వీట్ చేశారు. సంపర్క్ ఫర్ సమర్థన్లో భాగంగా సైనా నెహ్వాల్ను, ఆమె కుటుంబ సభ్యులను కలిసి నాలుగేళ్లుగా మోడీ ప్రభుత్వం చేపట్టిన పథకాలనను వివరించినట్లు తెలిపారు. అమిత్ షాతో భేటీ ద్వారా బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో కార్యక్రమాల గురించి తెలుసుకున్నానని సైనా నెహ్వాల్ పేర్కొన్నారు.
పొత్తులు ఉండవు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాంటి పొత్తులు ఉండవని, ఒంటరిగానే పోటీ చేస్తామని అమిత్ షా పార్టీ నేతలకు అంతకుముందు దిశానిర్దేశనం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఈ వేగం చాలదని, మరింత దూకుడుగా ముందుకెళ్లాలన్నారు. పార్టీపరంగా ప్రజలను నేరుగా కలిసే కార్యక్రమాలు లేవని, పార్టీ కార్యాచరణ అమలు కావడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలవారీగా గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లతో పాటు తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, బీజేపీకి ఉన్న అవకాశాలపైరాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కొన్ని పథకాలతో టీఆర్ఎస్ ఓట్ల రాజకీయం చేస్తోందని, కేంద్ర పథకాల పేర్లు మారుస్తోందన్నారు.
ఆ సంస్థల కీలక నేతలతో భేటీ
అమిత్ షా తొలుత 60 మంది కీలక ఆరెస్సెస్, బజరంగ్ దళ్, వీహెచ్పీ నేతలతో భేటీ అయ్యారు. సమాచారం మేరకు.. అయోధ్యలో రామజన్మభూమి, ఉమ్మడి పౌరస్మృతి, 370 ఆర్టికల్ రద్దు వంటి అంశాలపై కేంద్రం వైఖరిపై ఆరెస్సెస్ నేతలు అడిగారని తెలుస్తోంది. రామజన్మభూమి విషయంలో పరిణామాలన్నీ మనకు అనుకూలంగా మారుతున్నాయని, లోకసభ ఎన్నికల నాటికి స్పష్టత వస్తుందన్నారు. పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెప్పినట్లుగా తెలుస్తోంది.
మీ ఆవేదన తెలుసు కానీ
టీఆర్ఎస్ వంటి పార్టీలతో పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోందని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలని కొందరు ఆరెస్సెస్ నేతలు కోరారు. ఒంటరిగానే పోటీ చేస్తామని అమిత్ షా తెలిపారు. హిందుత్వ అంశాన్ని పార్టీ బలంగా చేపట్టాలని ఒకరు కోరారు. అంతేకాదు, స్వామీ పరిపూర్ణానంద విషయంలో హిందుత్వకు వ్యతిరేకంగా వ్యవహరించినవారిని కలవద్దన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ.. మీ ఆవేదన తెలుసునని, కానీ విరోధులను మరింత విరోధులుగా చేసుకోకూడదని చెప్పారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చామని, తెలంగాణలోనూ రావాలని కోరుకుంటున్నామని, పార్టీకి, ఆరెస్సెస్కు మధ్య సమన్వయం పెరిగితే వచ్చేసారి అధికారంలోకి రాగలమని అని కొందరు అభిప్రాయపడ్డారు. అలా జరిగితే నేనే మొదట సంతోషపడతానని అమిత్ షా చెప్పారు.