చంపేశా, నాపై నమ్మకమొద్దు: అక్కాచెల్లెళ్ల హత్య నిందితుడు, శ్రీలేఖతో ప్రేమ వ్యవహారం!
హైదరాబాద్: నేను శ్రీలేఖను చంపేశానని, తన పైన కూడా నమ్మకం పెట్టుకోవద్దని కొత్తపేట మోహన్ నగర్లో అక్కాచెల్లెళ్లు యామిని, అలేఖ్యలను దారుణంగా పొడిచి చంపిన అమిత్ సింగ్, ఘటన అనంతరం తన తండ్రి అమర్ సింగ్కు ఫోన్ చేసి తెలిపినట్లుగా తెలుస్తోంది.
ఈ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులతో పరారయ్యాడని తొలుత భావించారు. కానీ నిందితుడు అమిత్ తన తండ్రికి ఫోన్ చేసి పారిపోయాడని తేలింది. పోలీసులు అతడి తండ్రిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. తండ్రి పై వివరాలు చెప్పాడని సమాచారం.
ఘటనాస్థలి నుండి పారిపోయిన అమిత్ సింగ్ తొలుత అక్కడికి సమీపంలోనే ఉన్న తన గదికి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అయితే, అలా జరగలేదని పోలీసులు చెబుతున్నారు. తండ్రికి ఫోన్ చేసిన అమిత్, ఆ వెంటనే సంభాషణలు రికార్డ్ అయ్యే ప్రమాదమున్నదని స్విచ్చాఫ్ చేశాడు.
అతని ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, అమిత్ సింగ్ వ్యాఖ్యలను బట్టి అతను కూడా అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమిత్ సింగ్ కోసం నాలుగు బృందాలు తనిఖీ చేస్తున్నాయి.
కొత్త కోణం!
యామినీ, శ్రీలఖలు నివసించే మోహన్ నగర్ ప్రాంతానికి సమీపంలోనే కొంతకాలంగా అమిత్ ఉంటున్నట్లు దర్యాఫ్తులో తేలింది. శ్రీలేఖతో ప్రేమ వ్యవహారం ఉన్నందున అమిత్ను అతడి తండ్రి ఏడాది క్రితమే షాద్ నగర్ నుంచి హైదరాబాదుకు పంపించాడు.
ఆ తర్వాత కొంతకాలానికే శ్రీలఖ కుటుంబం హైదరాబాద్ వచ్చింది. ఆ తర్వాత అమిత్ కూడా అక్కడికి సమీపంలోకి మకాం మార్చాడు. తిరిగి మళ్లీ పరిచయం ఏర్పడింది. అమిత్ ప్రేమను శ్రీలేఖ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దానికి ప్రధాన కారణం.... అతడికి మద్యం సేవించే అలవాటు ఉండటమేనని తెలుస్తోంది.
ఇప్పటికే శ్రీలేఖ తండ్రి కృష్ణా రెడ్డి తాగుడు వ్యసనం వల్ల ఆర్టీసి ఉద్యోగం పోగొట్టుకోవడంతో శ్రీలేఖ కుటుంబం అథడి ప్రేమను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలేఖ తనకు దక్కదనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.