తెలంగాణలో అమిత్ షా ప్రచార సభలు రద్దు ... రీజన్ ఇదే
తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చవి చూసి, కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైన బీజేపీ, ఈసారి తన ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వంటి నేతలతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది బిజెపి.
అయితే నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కరీంనగర్, వరంగల్ బహిరంగసభలో పాల్గొనాల్సి ఉండగా ఆ సభలు కాస్త రద్దయ్యాయి. కరీంనగర్, వరంగల్ సభలలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజలు నిరాశ చెందకుండా రాష్ట్ర అధ్యక్షుడు సభను నిర్వహించాలని సూచించింది జాతీయ నాయకత్వం.
ఏప్రిల్ 4న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా కరీంనగర్, వరంగల్లో బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ సభల కోసం ఇప్పటికే బీజేపీ నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ సభకు హాజరు కాలేకపోయినా కనీసం వరంగల్ సభకైనా అమిత్ షా వస్తారని బీజేపీ నేతలు భావించారు కానీ అదికూడా రద్దు కావటంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు తీవ్ర నిరాశ పడ్డారు.
అయితే ప్రధాని మోదీతో అత్యవసర సమావేశం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో విధిలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సభలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపి ఈ సారి ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావించిన బీజేపీకి అమిత్ షా పర్యటన రద్దు కావడం కాస్త నిరాశను కలిగించింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి తన ఉనికిని చాటుకునేందుకు విఫల యత్నాలు చేస్తుంది.