జయలలిత కుమార్తె: హైదరాబాద్ లో డీఎన్ఏ పరీక్షలు చెయ్యాలంటున్న అమృత!
Recommended Video
బెంగళూరు/హైదరాబాద్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె అంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన బెంగళూరు అమృత సారథి అలియాస్ అమృత తన రక్త సంబంధాన్ని నిరూపించటానికి డీఎన్ఏ పరీక్షలకు సిద్ధమైనారు. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)ని అమృత ఆమె న్యాయవాది సహాయంతో సంప్రదిస్తున్నారు.
మాకు పంపలేదు
బెంగళూరుకు చెందిన అమృత తమకు ఇప్పటి దాకా ఎలాంటి రక్తపు నమూనాలూ పంపించలేదని సీసీఎంబీ వర్గాలు చెబుతున్నాయి. తాను జయలలిత కుమార్తె అని నిరూపించుకొనేందుకు అవకాశం ఇవ్వాలంటూ అమృత మద్రాసు హై కోర్టును ఇప్పటికే ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాలు ఉంటేనే !
సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన డీఎన్ఏ పరీక్షలను సీసీఎంబీ చేయ్యదు. కోర్టులు ఆదేశిస్తే మాత్రమే సీసీఎంబీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తోంది. తల్లిదండ్రులు లేదా బంధువుల రక్తపు నమూనాల ద్వారా ఒక వ్యక్తికి వారితో ఉన్న సంబంధాన్ని నిరూపించడానికి అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రులు లేరు
బెంగళూరుకు చెందిన అమృత తల్లిదండ్రులు మరణించారు. అందువలన వారి బంధువుల నుంచి తీసుకున్న రక్తపు నమూనాను పరీక్షించి ఆమెకు జయలలితకు రక్త సంబంధం ఉందా? లేదా ? అని నిరూపించడానికి అవకాశం ఉంటుంది.
అక్కడ మాత్రమే !
వై క్రోమోజోమ్లను గుర్తించే వై ఎస్టీఆర్ అనే పరీక్షల ద్వారా రక్తసంబంధాలను గుర్తిస్తారు. ఈ పరీక్షల చేయగల సామర్థ్యం, పరికరాలు తెలంగాణలోని హైదరాబాద్ లోని సీసీఎంబీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని డీఎన్ఏ నిపుణులు అంటున్నారు.
1980లో జయలలిత ఇంటిలో !
చెన్నైలోని మైలాపూర్లో ఉన్న జయలలిత నివాసంలో తాను జన్మించానని, కొన్ని కారణాల వల్ల తనను జయలలిత సోదరి శైలజ కూతురిగా ప్రపంచానికి పరిచయం చేశారని అమృత మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్లో వివరించారు.
రంజని, లలిత చెప్పారు !
జయలలిత మరణం తర్వాత తన సమీప బంధువులు రంజని, లలితల ద్వారా తనకు అసలు విషయం తెలిసిందని అమృత చెబుతున్నారు. తాను జయలలిత కుమార్తెను అని నిరూపించుకోవటానికి జయలలిత సమాధి నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించమని ఆదేశించాలని అమృత మద్రాసు హై కోర్టులో మనవి చేశారు.
అపోలోకు నోటీసులు
జయలలిత అపోలో ఆసుపత్రిలో 75 రోజులు చికిత్స పొంది మరణించారు. జయలలితకు చికిత్స చేసే సమయంలో ఆమె రక్తం, చర్మం, తల వెంట్రుకలు ఏమైనా సేకరించారా ? అని చెప్పాలని, వాటితో తాను డీఎన్ఏ పరీక్షలు నిర్వహించుకోవాలని అమృత అపోలో ఆసుపత్రికి గురువారం నోటీసులు జారీ చేశారు.