పెళ్లి రోజే అమృతకు పండంటి మగబిడ్డ, తండ్రికి హెచ్చరికలు చేస్తూ పోస్ట్!
నల్గొండ: అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని సతీమణి అమృత వర్షిణి బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. హైదరాబాదులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ప్రసవించింది. తల్లీ, కొడుకు క్షేమంగా ఉన్నారు. సాయంత్రం నాలుగుంపావుకు ప్రసవం అయింది.
అమృత కోరిక మేరకు ప్రసవం!
మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృతను అదే పట్టణానికి చెందిన ప్రణయ్ 2018 జనవరి 30న వివాహం చేసుకున్నాడు. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడం, తదనంతర పరిణామాలకారణంగా మారుతి రావు.. ప్రణయ్ను హత్య చేయించాడు. ఆ సమయంలో అమృత ఐదు నెలల గర్భిణి. డాక్టర్లు ఫిబ్రవరి 5న డెలివరీ తేదీ ఇచ్చినప్పటికీ అమృత కోరిక మేరకు బుధవారం ప్రసవం చేశారని తెలుస్తోంది. నిన్న పెళ్లి రోజు కూడా. అందుకే అదే రోజు ప్రసవం చేయించుకున్నారని తెలుస్తోంది. మనవడిలో తమ కొడుకు ప్రణయ్ని చూసుకుంటామని బాలస్వామి, ప్రేమలత చెప్పారు.
కొడుకులో ప్రణయ్
ప్రణయ్ హత్య అనంతరం అమృత వర్షిణి మాట్లాడుతూ... తాను బిడ్డ కోసం బతుకుతానని, బిడ్డకు జన్మనిచ్చి ప్రణయ్కు ప్రతిరూపంగా చూసుకుంటానని తెలిపింది. ఆమె అప్పటి నుంచి అత్తవారి సంరక్షణలోనే ఉంది.
హి ఈజ్ బ్యాక్... అమృత
కొడుకు పుట్టిన నేపథ్యంలో అమృత వర్షిణి 'జస్టిస్ ఫర్ ప్రణయ్' ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టింది. మిర్చి సినిమాలో ప్రభాస్ డైలాగ్ను తన భర్త ప్రణయ్కు అనువదించి, ఎడిట్ చేసి పోస్ట్ చేసింది. 'ఇరవయ్యేళ్ల నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒకలెక్క వాడి కొడుకు వచ్చాడు.. వాడి కొడుకు వచ్చాడని చెప్పు' అనే డైలాగ్ పోస్ట్ చేసింది. 'హీ ఈజ్ బ్యాక్' అని పోస్ట్ చేసింది. ఇది ఓ విధంగా తన తండ్రికి హెచ్చరికగా పెట్టిందని చెప్పవచ్చు.