అమృత ప్రణయ్కి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు..
కులాంతర వివాహం కారణంగా హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే 108 వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
అమృత ప్రణయ్ తండ్రి మారుతీరావు హైదరాబాద్ చింతల్ బస్తీలోని ఆర్యవైశ్య భవన్లో శనివారం రాత్రి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం మిర్యాలగూడలో మారుతీరావు అంత్యక్రియలు జరిగాయి. తండ్రి కడసారి చూపుకోసం అమృత వెళ్లినప్పటికీ ఆమెకు నిరాశే ఎదురైంది. కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో అక్కడినుంచి వెనుదిరిగింది. బాబాయ్ శ్రవణ్ స్నేహితులే తనను అడ్డుకున్నారని.. ఆయన కుమార్తె తనను నెట్టివేశారని అమృత ఆరోపించారు.
ఆస్తి కోసం అమృత డ్రామాలు ఆడుతోందని శ్రవణ్ ఆరోపించగా.. తనకు,తన బాబుకు,అత్తమామలకు చిల్లిగవ్వ కూడా అక్కర్లేదని అమృత తేల్చి చెప్పారు. తల్లి తన వద్దకు వస్తే తాను చూసుకోవడానికి సిద్దమని తెలిపారు. ప్రణయ్ జస్టిస్ జరగాలని తాను.. మారుతీరావు కోసం తన తల్లి ఇన్నాళ్లు చట్టబద్దంగా పోరాడామని.. కేసుల్లో ఉన్నందువల్లే ఇప్పటివరకు మాట్లాడుకోలేదని అమృత చెప్పారు. భర్త చనిపోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసన్నారు.
కాబట్టే తల్లిని ఓదార్చేందుకు అంత్యక్రియలకు వెళ్లానని చెప్పారు. తన తల్లే అమృతను అడ్డుకోమని చెప్పిందని వాళ్లు చెబుతున్నారని.. కానీ ఆమె అలా చెప్పిందో లేదో తనకు తెలియదన్నారు. ప్రణయ్ హత్య తర్వాత అతని కుటుంబం చేరదీయడంతో తాను ఒంటరిదాన్ని కాలేదని అన్నారు. కానీ ఇప్పుడు తన తల్లి ఒంటరిదైపోయిందని అన్నారు.
తన తల్లి బాధ్యతలు తీసుకునేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. 'అమ్మా స్ట్రాంగ్గా ఉండు.. భయపడకు.. నీ లైఫ్ నాశనం అవాలని నేను అనుకోలేదు. ఎవ్వరినీ నమ్మవద్దు.. చుట్టుపక్కలవాళ్లను అస్సలు నమ్మవద్దు. నిన్ను ట్రాప్ చేసేవాళ్లు ఉంటారు. నువ్వు నన్ను కలవాలి అనుకుంటే నిన్ను కలుస్తాను. నిన్ను ఓదార్చాలనే వచ్చాను.. నువ్వు వద్దన్నావని చెబుతున్నారు.. దానిపై క్లారిటీ లేదు. నా దగ్గరకు వస్తే కచ్చితంగా నిన్ను చూసుకుంటాను. తొందరపాటు నిర్ణయాలతో ఇంకొక లైఫ్ పోవాలని లేదు. ఏ సహాయం కావాలన్నా నన్ను సంప్రదించు.' అంటూ అమృత కన్నీటిపర్యంతమయ్యారు.