రాంగోపాల్ వర్మ 'మర్డర్'పై అమృత రియాక్షన్... దర్శక,నిర్మాతలకు కోర్టు నోటీసులు..
వివాదాస్పద కథాంశాలతో,వాస్తవ సంఘటనలతో సినిమాలు తెరకెక్కించడం,విడుదలకు ముందే కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించుకోవడం దర్శకుడు వర్మకు అలవాటైన పంథా. గతంలో ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్,వంగవీటి తదితర చిత్రాలపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆయన నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న 'మర్డర్' సినిమాపై కూడా నల్గొండ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
వర్మ 'మర్డర్' సినిమాపై మంగళవారం(అగస్టు 4) అమృత ప్రణయ్ స్పందించారు. వాస్తవ సంఘటనలకు దూరంగా వర్మ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల క్రితం ప్రణయ్ హత్య ఘటన, ఐదు నెలల క్రితం మారుతీరావు ఆత్మహత్య ఘటనతో తాము తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో వర్మ 'మర్డర్' సినిమా తీసి తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు వాపోయారు.
తమ అనుమతి లేకుండా పేర్లు, నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తీసి తమ జీవితాలపై ప్రభావం చూపుతున్నారని అమృత ఆవేదన వ్యక్తం చేశారు. మర్డర్ సినిమాలో తమ పేర్లు, ఫొటోలు వాడుకున్నందుకు, సినిమాను నిలిపేయాలని కోరుతూ గత నెల 29న నల్గొండ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసినట్లు అమృత తెలిపారు.
అమృత పిటిషన్ను నల్గొండ కోర్టు ఎస్సీ ఎస్టీ కోర్టుకు బదిలీ చేసింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ నెల 6న 'మర్డర్' చిత్ర దర్శక నిర్మాతలు కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ ఈమెయిల్, వాట్సాప్ల ద్వారా దర్శక నిర్మాతలకు నోటీసులు పంపించింది.
Recommended Video
కాగా,రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. దళితుడైన ప్రణయ్,వైశ్య సామాజికవర్గానికి చెందిన అమృతలు ప్రేమ వివాహం చేసుకోగా... ఆ వివాహం ఇష్టం లేని అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ని హత్య చేయించాడు. హత్య కేసులో అరెస్టయి జైలుకెళ్లిన మారుతీరావు... కొద్ది కాలానికి బెయిల్పై బయటకొచ్చాడు. ఇదే క్రమంలో ఈ ఏడాది మార్చి 8న హైదరాబాద్లోని వైశ్య భవన్లో మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనల ఆధారంగా వర్మ ప్రస్తుతం మర్డర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.