మిర్యాలగూడ మారుతీ రావు ఆత్మహత్య : కుమార్తె అమృత ప్రణయ్ రియాక్షన్ ఇదీ..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య సంచలనం రేకెత్తిస్తోంది. శనివారం రాత్రి హైదరాబాద్ చింతల్ బస్తీలోని ఆర్యవైశ్య భవన్లో మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సైఫాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసుపై విచారణ జరుగుతున్న సమయంలోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఆత్మహత్యపై తాజాగా ఆయన కుమార్తె అమృత స్పందించారు.
Recommended Video
అమృత ఏమన్నారు..
మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయంపై తమకు స్పష్టత లేదని.. టీవీలో చూసే తెలుసుకున్నామని అమృత అన్నారు. ఆత్మహత్యకు కారణమేమై ఉంటుందనుకున్నారా అన్న ప్రశ్నకు.. ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని చెప్పారు. బహుశా చేసిన తప్పుకు పశ్చాత్తపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అన్నారు. ప్రణయ్ హత్య తర్వాత మళ్లీ తన తండ్రితో ఎప్పుడూ మాట్లాడలేదని.. చూడలేదని అన్నారు.ప్రణయ్ హత్య తర్వాత మారుతీరావు చాలాసార్లు అమృతకు రాయబారం పంపారు. పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం విడుదలైనప్పటినుంచి అమృతను మారుతీరావు వేధింపులకు గురిచేశాడన్న ఆరోపణలున్నాయి. తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి మొత్తం రాసిస్తానని చెప్పారు. కానీ అమృత మాత్రం ఆయన ప్రలోభాలకు తలొగ్గలేదు. తన భర్తను హత్య చేసినవాళ్లకు శిక్ష పడాల్సిందేనని ఆమె మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది.
సోదరుడితో ఆస్తి వివాదాలు..
మారుతీరావుకు కొంతకాలంగా తన సోదరుడితో ఆస్తి వివాదాలు నెలకొన్నట్టు సమాచారం. ఆస్తిని తన కొడుకుల పేరు మీద రాయించాలని వేధిస్తున్నందువల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. గడిచిన కొంతకాలంగా అతను హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నట్టు సమాచారం. ఏదైనా అత్యవసరం అనుకుంటేనే మిర్యాలగూడ వెళ్లి వస్తున్నట్టు తెలుస్తోంది. శనివారమే ఆయన ఓ గదిని అద్దెకు తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఉదయం అతను అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆర్యవైశ్య భవన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు.. మారుతీరావు మృతదేహాన్ని పరిశీలించారు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్దారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కొద్దిరోజుల క్రితం షెడ్డులో మృతదేహం..
మిర్యాలగూడలో మారుతీరావుకు సంబంధించిన ఓ షెడ్డులో ఇటీవలే గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో దాన్ని గుర్తుపట్టడానికి వీల్లేకుండా పోయింది. దానిపై కూడా ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఇక ప్రణయ్ హత్యకు మాజీ ఐఎస్ఐ తీవ్రవాదులతో మారుతీరావు కోటి రూపాయలకు డీల్ కుదుర్చుకున్నాడని పోలీసు విచారణలో తేలిన సంగతి తెలిసిందే.
సంచలనం సృష్టించిన పరువు హత్య
రెండేళ్ల క్రితం అమృత ప్రణయ్ను ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంతో.. మారుతీరావు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి అతన్ని హత్య చేయించాడు. మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో అమృతకు వైద్య పరీక్షల అనంతరం బయటకు వస్తున్న క్రమంలో వెనుక నుంచి దాడి చేసిన దుండగులు కత్తితో అతని తలపై నరికి హత్య చేశారు. అందం,ఆస్తి అన్నీ ఉన్నప్పటికీ కేవలం కులం తక్కువ అన్న కారణంతో ప్రణయ్ను మారుతీరావు హత్య చేయించడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది.