అమృతవర్షిణి ఏకగ్రీవంగా ఎన్నుకొని అసెంబ్లీకి పంపాలి: తమ్మినేని
మిర్యాలగూడాలో జరిగిన పరువుహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రణయ్ను దారుణంగా చంపించాడు అమృతవర్షిణి నాన్న మారుతీరావు. అయితే ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసును అతితక్కువ సమయంలోనే చేధించారు. మారుతీరావు పరువు నిజంగా ఇప్పుడు పోయిందని ఎస్సీ రంగనాథ్ అన్నారు.
ఇదిలా ఉంటే.. ప్రణయ్ భార్య అమృతవర్షిణని పలువురు రాజకీయ నేతలు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. ఈ కష్టసమయంలో కూడా ఆమె ధైర్యం చూసి నేతలు నివ్వెరపోతున్నారు. కులహంకారంపై ఆమె పోరాడుతానని చెప్పడం చూస్తూ ఆమెకు ఎంతటి ధైర్యం ఉందో తెలుస్తోందన్నారు. అమృతను మంగళవారం కమ్యూనిస్ట్ నేత తమ్మినేని వీరభద్రం, టీమాస్ ఛైర్మెన్ కంచెఐలయ్యలు పరామర్శించారు. ఈ సందర్భంగా అమృతను ఏకగ్రీవంగా అసెంబ్లీకి పంపాలని ప్రతిపాదించారు. అమృతను పోటీకి నిలిపితే ఏకగ్రీవం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తామని చెప్పారు. కులదురహంకారానికి బలైన ప్రణయ్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
తెలుగురాష్ట్రాలను కుదిపేసిన ఈ ఘటన తెలిసి కూడా ఇప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడలేదని తమ్మినేని, ఐలయ్యలు మండిపడ్డారు. హోంమంత్రి నాయిని, కేటీఆర్, జిల్లామంత్రి జగదీశ్ రెడ్డిలు పరామర్శించేందుకు కూడా రాకపోవడం దారుణమన్నారు. ఈ కేసులో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయని మరి సీఎం కేసీఆర్ ఆయన్ను ఎందుకు సస్పెండ్ చేయరని తమ్మినేని ప్రశ్నించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐలయ్య డిమాండ్ చేశారు.
Recommended Video