ఆసక్తికర సన్నివేశం: చంద్రబాబు, రమణ... వెనకే నాయిని, అయ్యో.. అన్నీ వినేశారా?
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీటీడీపీ అధ్యక్షుడు రమణ మాట్లాడుకుంటున్న మాటలు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వినేశారా? ఈ ఫొటో చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది.. కానీ అసలేం జరిగిందంటే..
Recommended Video
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీటీడీపీ అధ్యక్షుడు రమణ మాట్లాడుకుంటున్న మాటలు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వినేశారా? ఈ ఫొటో చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది.. కానీ అసలేం జరిగిందంటే..
ఏపీ సీఎం చంద్రబాబు చాలా రోజుల తర్వాత గురువారం హైదరాబాద్ వచ్చారు. రేవంత్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడంతో పార్టీ కార్యకలాపాలపై కీలక నేతలతో ఎన్టీఆర్ భవన్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశం నిర్వహించారు.
అయితే ఈ సమావేశం కంటే ముందే గవర్నర్ నరసింహన్ పిలుపు మేరకు రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ మాతృమూర్తి విజయలక్ష్మి మరణించి నేటితో 13 రోజులు పూర్తయిన సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం 'శుభ స్వీకారం' కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీనికి ఏపీ, తెలంగాణ, చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, రమణ్ సింగ్తో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్, మంత్రులు, ఇతర పార్టీల ముఖ్యనేతలందరూ పాల్గొని నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ముందు వరుసలో కూర్చుని ఉండగా.. వాళ్ల వెనుకే తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూర్చున్నారు.
అయితే ఈ సందర్భంగా రమణతో చంద్రబాబు చర్చిస్తుండగా వెనకే ఉన్న హోంమంత్రి నాయిని వారివైపే చూస్తూ.. ఆసక్తికరంగా వాళ్ల సంభాషణనే వింటున్నట్లుగా ఉన్న సన్నివేశం కెమెరాకు చిక్కింది. ఈ దృశ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
'చంద్రబాబు-రమణ మాట్లాడుకుంటున్న రహస్యాలను నాయిని వినేసినట్టున్నారు..' అని కొందరు అనుకుంటుండగా... 'సీఎం కేసీఆర్ కనుక ఈ ఫొటో చూస్తే నాయినికి హోంశాఖతో పాటు ఇంటలిజెన్స్ బాధ్యతలను కూడా అదనంగా అప్పగిస్తారేమో..' అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.