ఎంబీఏ గ్రాడ్యుయేట్: చేసేది ఇంత చిల్లర పనులా?, అడ్డంగా బుక్కయ్యాడు..
చోరీలకు పాల్పడుతున్న కిరణ్ రెడ్డి అనే ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Recommended Video
హైదరాబాద్: ఎంబీఏ చదువుకున్న ఓ యువకుడు డబ్బు కోసం పక్కదారి పట్టాడు. ఉద్యోగం చేసి సంపాదించుకోవాల్సింది పోయి చోరీల ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డాడు.
ఫిర్యాదులతో నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతగాడిని పట్టుకున్నారు. తీరా దొరికాక.. 'సార్.. నేనెలా దొరికాను' అంటూ అమాయకంగా ప్రశ్నించాడు. ఆశ్చర్యపోయిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చిల్వకోడూరు సమీపంలోని గోవింద్పల్లి ప్రాంతానికి చెందిన బాదం కిరణ్ రెడ్డి(26) ఎంబీఏ పూర్తి చేశాడు. నగరంలోని యూసుఫ్ గూడ యాదగిరి నగర్ లో ఉంటున్న అతని బావ వద్ద ఉంటున్నాడు.
ఆ నివాసానికి పక్కనే ఓ బాలుర వెల్ఫేర్ హాస్టల్ ఉంది. ఈజీ మనీ ఆలోచనలో కిరణ్ రెడ్డి.. ఆ హాస్టల్లో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్ ఎత్తుకెళ్లి సొమ్ము చేసుకునేవాడు. ఎత్తుకెళ్లిన ఫోన్లను ఆ వెంటనే స్విచాఫ్ చేసేవాడు. హాస్టల్ వద్ద సీసీ కెమెరాలు ఉన్నట్లు గురించి పథకం ప్రకారం వాటిని పక్కకు జరిపాడు.
దొంగతనాలు చేసే సమయంలో తన కదలికలు అందులో రికార్డవకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇటీవల తను చోరీ చేసిన మొబైల్ ఫోన్స్ లో ఒకదానిని కిరణ్ రెడ్డి స్విచ్ఛాన్ చేశాడు. దీంతో అతని సిగ్నల్స్ ఆధారంగా అతను ఉంటున్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించగలిగారు.
నేరుగా అతను ఉంటున్న గదికి వెళ్లి చోరీల చిట్టా బయటపెట్టారు. అతని నుంచి రూ. 1.8లక్షల విలువైన చరవాణులు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చోరీ చేసిన వాటిల్లో ఒక ఫోన్ను సరిగ్గా స్విచ్ఛాఫ్ చేయకపోవడం వల్లే దొరికపోయావని నిందితుడు నాలుక కరుచుకున్నాడు.