సీఎం సొంత జిల్లాలో కలకలం.. ఇవాళ ఏదో ఒకటి తేల్చుకోవాలని..
''నాకు పోరాడే శక్తిలేదు.. ఇక్కడికి వచ్చేముందు మానవ హక్కుల సంఘానికి లెటర్ రాసిన. ఇయ్యాల ఏదో ఒకటి తేల్చుకోవాలనే వచ్చిన. నా భార్య చనిపోయింది.. కొడుక్కి ఉద్యోగం లేదు.. రెండెకరాల భూమే మాకు ఆధారం. చిన్నప్పటి నుంచి సాగుచేసుకుంటున్న పొలం.. నాది కాదని ఈ ఎమ్మార్వో, వీఆర్వో అంటున్నరు.. డబ్బులు కావాలని డిమాండ్ చేసిన్రు.. ఇగ నేను ఎట్ల బతకాలె? ఎందుకు బతకాలె?'' అంటూ వెంటతెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ను బయటికి తీశాడు వృద్ధ రైతు కాసుల కృష్ణయ్య.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని పట్టపగలు ఆఫీసులోనే పెట్రోల్ పోసి కాల్చేసిన ఘటన తర్వాత తెలంగాణలో పలు చోట్ల రైతులు తహశీల్దార్ కార్యాలయాల్లో రచ్చకు దిగిన సందర్భాలున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా సిద్ధిపేటలోనూ పెద్దవయసున్న ఓ రైతు పెట్రోల్ బాటిల్ తో తహశీల్దార్ కార్యాలయానికి రావడం కలకలం రేపింది. పోలీసులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. ఈ ఘటనపై మంత్రి హరీశ్ రావు కూడా స్పందించారు.
సిద్ధిపేట మండల పరిధిలోని మిట్టపల్లి గ్రామానికి కాసుల కృష్ణయ్య అనే రైతు ఏళ్లుగా తన రెండెకరాల పొలంలో సాగుచేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన అన్నిపత్రాలూ ఉన్నాయని, రైతు బంధు పథకం కింద డబ్బులు కూడా వస్తున్నాయని ఆయన చెప్పారు. కొద్ది రోజుల కిందట సడెన్ గా వీఆర్వో వచ్చి భూయజమానులు మీరుకాదని చెప్పడంతో అవాక్కయిన రైతు.. నిర్ధారణ కోసం కాళ్లగిరేలా తహశీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగాడు. ఏదో ఒకటి తేల్చుకుంటానంటూ గురువారం పెట్రోల్ బాటిల్ తో ఆఫీసుకొచ్చాడు. ఆత్మహత్యయత్నం చేసుకోబోయిన ఆయనను పోలీసులు కాపాడారు. అయితే..
కృష్ణయ్య సాగుచేస్తోన్న భూమి ప్రభుత్వానికి చెందిందని, కృష్ణయ్యతోపాటు ఆయనకు అమ్మినవాళ్లకు కూడా నోటీసులు పంపినమాట వాస్తవమేనని సిద్దిపేట రూరల్ ఎమ్మార్వో అంగీకరించారు. సదరు రైతు నోటీసులకు స్పందించకుండా, ఆఫీసుకొచ్చి న్యూసెన్స్ చేయడమేంటని వాపోయారు. ఈ ఘటనకు సంబంధించి మంత్రి హరీశ్ రావు.. తహశీల్దారుకు ఫోన్ చేశారు. రైతును ఇబ్బంది పెట్టొద్దని, సమస్యను పరిష్కరించి పంపాలని సూచించారు. దీంతో ఉద్రిక్తతకు తెరపడింది.