కరోనా : నేను రాను దవాఖానా... కరీంనగర్లో మొండికేసిన వృద్దురాలు...
కరోనా భయం,అపోహలు సమాజంలో గందరగోళానికి దారితీస్తున్నాయి. అపోహలతో కొంతమంది కరోనా పేషెంట్ల పట్ల వివక్ష చూపిస్తుండగా.. మరికొందరు భయాందోళనతో ఆస్పత్రిలో చేరేందుకు నిరాకరిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో కరోనా సోకిన ఓ వృద్దురాలు ఆస్పత్రికి వెళ్లేందుకు మొండికేసింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శంకరపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్దురాలికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో స్థానిక వైద్యాధికారులు ఆమెను అంబులెన్సులో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. శనివారం(జూలై 25) ఆమె ఇంటికి వెళ్లిన వైద్య సిబ్బంది వృద్దురాలిని అంబులెన్సులో ఎక్కించారు.
మార్గమధ్యలో మూత్ర విసర్జన పేరుతో వృద్దురాలు కిందకు దిగింది. ఆపై అక్కడినుంచి తప్పించుకుని శంకరపట్నం చేరుకుంది. అక్కడి బస్టాండ్ పరిసరాల్లో ఆ వృద్దురాలు తిరుగుతున్నట్లు అంబులెన్సు సిబ్బందికి సమాచారం అందింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే రోడ్డు పైనే బైఠాయించిన వృద్దురాలు ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించింది. అయితే ఆస్పత్రి సిబ్బంది బలవంతం చేయడంతో కొద్ది గంటల తర్వాత ఎట్టకేలకు అయిష్టంగానే అంబులెన్సు ఎక్కింది. ప్రస్తుతం కరీంనగర్ ఆస్పత్రిలో వృద్దురాలికి చికిత్స అందిస్తున్నారు.