ఇద్దరి కథ: చోరీలకే ఫోర్డ్ కారు కొన్నాడు, యాక్టర్ కావాలని ముంబై చేరి...
హైదరాబాద్: యాక్టర్ కావాలని డబ్బు కోసం చోరీలకు పాల్పడ్డాడు. స్టార్ హోటళ్లను తన చోరీలకు టార్గెట్ చేసుకుని అందుకు ఫోర్డ్ కారు కొన్నాడు. నిజానికి అతను చాలా పేద కుటుంబంలో పుట్టాడు. సినిమాల్లో నటించాలనే కోరికతో ముంబై చేరి నటన, నృత్యం నేర్చుకున్నాడు.
అయితే సినిమాల్లో అవకాశాలు రాలేదు. రైలు ప్రయాణంలో ఓ బిటెక్ చదివిన యువకుడితో కుదిరిన స్నేహం అతని జీవితాన్ని మార్చేసింది. సినిమాల్లో నటించాలనే కోరిక తీర్చుకోవడానికి దొంగగా మారాడు. చోరీల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ పోలీసులకు సవాల్ విసిరాడు. అయితే చివరకు పోలీసులకు చిక్కాడు. ఇదీ ఆర్యప్రతాప్ నాగ్ కథ. డీసీపీ లింబారెడ్డి అందుకు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఛత్తీస్గఢ్ జగదల్పూర్ గ్రామానికి చెందిన ఆర్యప్రతాప్ నాగ్ పాఠశాల స్థాయి వరకూ చదివాడు. ఉద్యోగం కోసం ఢిల్లీ చేరాడు. కొద్దికాలం దొరికిన పనులన్నీ చేశాడు. సినిమాపై మోజుతో ముంబై చేరాడు, యాక్టింగ్, డ్యాన్స్ నేర్చుకున్నాడు. అతడు అద్దెకు ఉండే గది ఎదురుగా లాడ్జి ఉండేది. అర్ధరాత్రి వేళ లాడ్జిలో ఖరీదైన వస్తువులు కాజేశాడు.
జైలుకు కూడా వెళ్లాడు. కానీ అతను మారలేదు. నిరుడు రైలు ప్రయాణంలో హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రాంత యువకుడు మహ్మద్ ముస్తఫాతో పరిచయం ఏర్పడింది. ఇతడు సివిల్ ఇంజనీరింగులో బీటెక్ పూర్తిచేశాడు. ఇద్దరు చెల్లెళ్లు, తల్లిని పోషించేందుకు ఇంటీరియర్ డెకొరేషన్ పనిచేశాడు. అతను కూడా దొంగతనాలకు దిగాడు. ఆర్యప్రతాప్నాగ్కు తన ఇంట్లోనే వసతి ఏర్పాటుచేశాడు.
చోరీల కోసం ముస్తఫా ఫోర్డ్ కారు కొన్నాడు. దొంగతనం చేసేందుకు కేవలం లాడ్జిలు, ఫైవ్స్టార్ హోటల్స్, ఇళ్లను ఎంచుకునేవారు. ఎంపికచేసిన హోటల్స్పై రెక్కీ నిర్వహించేవారు. రాత్రివేళ కారులో బయల్దేరి అక్కడకు వెళ్లేవారు. ముస్తఫా కారులో కూర్చునేవాడు.
చిన్నపాటి ఆధారం దొరికితే ఎంత ఎత్తయిన ఎక్కగల నేర్పు ఆర్యప్రతాప్ సొంతం. దీంతో అతను రంగంలోకి దిగేవాడు. పైపుల ద్వారా బిల్డింగ్ పైకి ఎక్కి కిటికీలు తెరిచి ఉన్న ఇళ్లు, హోటల్ రూమ్ల్లోకి వెళ్లి కనిపించిన విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు చోరీ చేసేవాడు.
ఏడాదిన్నర వ్యవధిలో బేగంపేట, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, గోపాలపురం, మియాపూర్ తదితర ప్రాంతాల్లో 14 చోరీలు చేశారు. పలు స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయి. బీటెక్ చదివిన యువకుడు ఫోర్డ్కారులో ఉండడంతో ఎవరూ అనుమానించేవారు కాదు. దొంగతనం చేసే సమయంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఫోన్ ద్వారా ఆర్యప్రతాప్కు చేరవేస్తుంటాడు.
దొంగిలించిన బంగారు ఆభరణాలను నకిలీ రశీదులతో పన్నాలాల్ అనే వ్యాపారికి అమ్మేవారు. వచ్చిన సొమ్మును చెరిసగం పంచుకునేవారు. ఇప్పటి వరకూ వీరిద్దరూ కిలోన్నర బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఆర్య ప్రతాప్నాగ్ను పోలీసులు గతంలోనే అరెస్టు చేశారు. అతడి సహచరుడు మహ్మద్ ముస్తఫాను సోమవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 1.45 కిలోగ్రాముల బంగారు ఆభరణాలు, ఫోర్డ్కారు, రెండు సెల్ఫోన్లు, రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాదులోని బేగంపేట వద్ద లాడ్జిలో చోరీ చేసేటప్పుడు లభించిన సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా డీఐ బలరామిరెడ్డి, నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి.బలవంతయ్య దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆధునిక టెక్నాలజీ సహాయంతో నిందితుల వివరాలు రాబట్టారు.