యాంకర్ నిరోషకు డిప్రెషన్ అంటే తెలియదు! స్వగ్రామానికి మృతదేహం
హైదరాబాద్/చిత్తూరు: ఆత్మహత్య చేసుకున్న యాంకర్ నిరోష ఎప్పుడు కూడా డిప్రెషన్ గా కనిపించలేదని ఆమె సోదరుడు చెప్పారు. నిరోష మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు షాక్కు గురయ్యారు. ఆమె ఇలా చేస్తుందని ఎవరూ అనుకోలేదంటున్నారు.
నిరోష ప్రతి విషయాన్ని ముక్కుసూటిగా చెబుతుందని, తాను పది రోజుల క్రితం కలిసినప్పుడు సంతోషంగానే ఉందని సోదరుడు మహేష్ చెప్పారు. ఇతను బెంగళూరులో బ్యాంక్ ఉద్యోగి. ఆమె చలాకీ మనిషి అని స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు.
కాగా, హైదరాబాద్లో ఉరేసుకున్న యాంకర్ నిరోషా పార్థివ దేహం గురువారం చిత్తూరు జిల్లాకు చేరుకుంది. నిరోష స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని సోమల మండలం మల్లేశ్వరపురం. తల్లిదండ్రులు రాధాకృష్ణమనాయుడు, వసంతమ్మలు హైదరాబాద్ నుంచి ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు.
నిరోష బంధువులు మల్లేశ్వరపురంలో ఉండటంతో అక్కడే అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. నిరోష పార్థివ దేహాన్ని చూసిన బంధవులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. ఎప్పుడూ చలాకీగా ఉండే నిరోషా చనిపోయిందన్న విషయాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు.
నిరోషా మల్లేశ్వరపురంలోని నంజంపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. తిరుపతి పద్మావతి కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత కుటుంబం బెంగళూరు వెళ్లడంతో అక్కడకు వెళ్లారు. రెండు సంవత్సరాల పాటు యాంకర్గా పని చేశారు.