మానసిక మానభంగం... ఒంటరి పోరాటానికైనా రెడీ... 143 మంది రేప్ కేసుపై యాంకర్ ప్రదీప్ రియాక్షన్...
సంచలనం రేకెత్తిస్తున్న యువతిపై 143 మంది అత్యాచారం కేసుపై ప్రముఖ యాంకర్ మాచిరాజు ప్రదీప్ స్పందించారు. ఈ కేసులో బాధితురాలు ప్రదీప్ పేరును కూడా బయటపెట్టిన నేపథ్యంలో ప్రదీప్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. బాధితురాలు చేస్తున్న ఆరోపణలను ఖండించిన ప్రదీప్... ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ఆమె చెప్తున్న పేర్లు,స్థలాలు ఇతరత్రా వాటితో తనకేవిధమైన సంబంధం లేదన్నారు. గత రెండు,మూడు రోజులుగా సోషల్ మీడియాలో తనపై విపరీతమైన ట్రోలింగ్స్ వస్తుండటంతో ఈ వీడియో చేయాల్సి వచ్చిందన్నారు.
నిజానిజాలు తెలుసుకోకుండా....
'నాపై వస్తున్న ఆరోపణలు బాధపెట్టాయి. నిజానిజాలు తెలుసుకోకుండా వాళ్లకు వాళ్లే నిర్దారించుకుని.. నా ఫోటోలు వాడుకుని వీడియోలు,ఆర్టికల్స్ చేయడం ఎంత దారుణం. ఎంత సెన్సిటివ్ విషయం ఇదీ... ఏమీ ఆలోచించకుండా కేవలం ప్రదీప్ అనే పేరు వినగానే టపాటపా హెడ్ లైన్స్ పెట్టి తోచింది రాసేయడమేనా...? నా పేరు చెప్పినవాళ్లు ఏ ఉద్దేశంతో చెప్పారు... ఎందుకు చెప్పారు... ఎవరు చెప్పించారో ఆలోచించకుండా నన్ను టార్గెట్ చేయడం దారుణం. కొంతమంది ఎంత దారుణమైన భాష వాడుతున్నారంటే... ఆ అమ్మాయికి జరిగిందే నా కుటుంబంలో ఉన్నవారికి కూడా చేస్తామని కామెంట్స్ పెడుతున్నారు. ఒక వ్యక్తికి న్యాయం చేయడం కోసం మరో వ్యక్తికి అన్యాయం చేస్తారా...' అని ప్రదీప్ చెప్పుకొచ్చారు.
మానసిక మానభంగం...
'కేవలం వ్యూస్ కోసం నా పేరుతో వీడియోలు చేస్తారా... ఒకరిని మించి ఒకరు వీడియోలు చేస్తుంటే.... ఈ ప్రచారానికి నాకు గానీ ,నా కుటుంబ సభ్యులకు గానీ ఏమైనా అయితే దానికి ఎవరు బాధ్యులు. ఒకవిధంగా మానసిక మానభంగం చేస్తున్నారు. సోషల్ మీడియా ఉన్నది ఒక మంచి ఉధ్దేశం కోసం. కానీ ఇలా చేస్తారా. నిజం ఉందనుకోండి... అంతా నిజం ప్రకారమే వెళ్తుందిగా. దీని వెనకాల ఎవరున్నారు... ఏమిటి అన్ని బయటకు తీసుకొస్తాను. కానీ ఈలోపే వార్తలు క్రియేట్ చేస్తే ఎవరెంత ఎఫెక్ట్ అవుతారో ఆలోచించండి.' అని ప్రదీప్ యూట్యూబ్ చానెల్స్కు విజ్ఞప్తి చేశారు.
నాకు సంబంధం లేదు...
'ఇకనైనా సోషల్ ట్రోలింగ్ ఆపండి. జనాలను ఎంటర్టైన్ చేయడానికి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. ఈస్థాయి దాకా వచ్చింది జనాలను ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే. అది తప్ప నాకు ఇంకేమీ రాదు. ఇప్పటివరకూ ఎవరికీ అన్యాయం చేయలేదు.వీలైతే సాయం చేయడం తప్ప. ఇదివరకు కూడా నా పేరుతో ఫేక్ ఐడీలు పెట్టి కొంతమంది మోసాలకు పాల్పడ్డారు. అప్పట్లో యాంకర్ ప్రదీప్ ఆత్మహత్య అని ప్రచారం చేశారు. కాలు విరిగి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటే... అంతుచిక్కని వ్యాధితో ప్రదీప్ అని ప్రచారం చేశారు. మొన్నటికిమొన్న కోర్టు కేసులో ఉన్నాడు... జైలుకెళ్లి వచ్చాడని ఏదేదో రాశారు. కానీ ఇప్పుడు ఓ ఆడపిల్ల ఇష్యూ. నన్ను ఇన్నాళ్లు కుటుంబంలా భావించినవాళ్లు,నాపై వస్తున్న వార్తలు చూసి బాధపడుతుంటే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. వాళ్ల ఆరోపణలు,చెప్తున్న స్థలాలు, దేనితో నాకు సంబంధం లేదు. నిజానిజాలు తేలే లోపు ఎవరైతే నాపై ప్రచారం చేస్తున్నారో... వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఒంటరి పోరాటమైనా చేస్తాను. న్యాయం అందరికీ జరగాలి... నాకూ జరగాలి.' అని ప్రదీప్ వ్యాఖ్యానించారు.
సంచలనంగా మారిన కేసు...
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ యువతి ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గత 11 ఏళ్లుగా 143 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. సంచలనం రేకెత్తిస్తున్న ఈ కేసులో యాంకర్ ప్రదీప్ పేరును కూడా బాధితురాలు బయటపెట్టారు.ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా ఈ పేరును ప్రస్తావించారు. దీంతో సోషల్ మీడియాలో ప్రదీప్పై తీవ్ర విమర్శలు,ట్రోలింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.