పాతబస్తీలో సొరంగం: గోల్కొండకు దారేనా?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని పాతబస్తీలోని చార్మినార్కు సమీపంలో గల బండికా అడ్డా వద్ద సొరంగం బయటపడింది. ఖాళీగా ఉన్న స్థలం యజమాని భవన నిర్మాణం కోసం రెండు రోజుల క్రితం పనులు ప్రారంభించారు. ఇంతలో ఒక సొరంగమార్గం కనిపించింది. పక్కనే మరో రెండు సొరంగాలు ఉన్నాయేమోనని అనుమానిస్తున్నారు.
దానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసు అధికారులు అక్కడ పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. మరోవైపు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారూ రంగంలోకి దిగారు. అయితే ఆదివారం సెలవు కావడంతో పరిశీలన పనులను ప్రారంభించలేదు.
అర్ధచంద్రాకారంలో 10 అడుగుల లోతు, ఇరవై మీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ నిర్మాణం పూర్తిగా గ్రానైట్, మట్టితో నిర్మించారు. గుల్జార్హౌజ్ నుండి హైకోర్టు వరకు దూద్మహల్ను పోలిన నిర్మాణాలు గతంలో ఉండేవని స్థానికులు పేర్కొన్నారు. సొరంగం బయటపడిందనే వార్తతో చుట్ట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
గోల్కొండకు దారేనా..?
హైదరాబాద్లోని పాతనగరానికి చరిత్ర ఉంది. భాగ్యనగరం అనే పేరూ ఉంది. దేశ, విదేశాల నుంచి నగరానికి వచ్చే సందర్శకులు తప్పని సరిగా చారిత్రాత్మకమైన చార్మినార్ను సందర్శించకుండా ఉండలేరు. ఇంత చరిత్ర ఉన్న చార్మినార్కు గోల్కొండ కోటకు మధ్య సొరంగ మార్గం ఉండేదని చరిత్రకారులు రాశారు. కానీ చార్మినార్లో మాత్రం అటువంటి ఆనవాళ్లు ఏమీ లేవని కొందరు వాదించారు. అయితే నేరుగా చార్మినార్ నుంచే కాకుండా దానికి అర కిలో మీటరు దూరంలో గానీ, కొంత దూరంలోగానీ సొరంగ మార్గాన్ని నిర్మించి ఉంటారనే ప్రచారం అనాదిగా ఉంది. శత్రువుల దాడి నుంచి తప్పించుకునేందుకు సొరంగ మార్గాన్ని నిర్మించుకుని ఉంటారన్న ప్రచారం ఉంది.
కులీకుతుబ్ షా కాలం నాటిదేనా?
చారిత్రక భాగ్యనగరంలో గతంలోనూ చార్మినార్కు దగ్గర్లో రెండు సొరంగాలు బయటపడ్డాయి. కానీ అవి ఎక్కువ దూరం లేవు. 10 నుంచి వంద అడుగుల దూరం వరకే ఉన్నాయి. ఒకవేళ చరిత్రకారులు పేర్కొన్నట్లు గోల్కొండ నుంచి చార్మినార్కు సొరంగ మార్గం ఇదేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అదే నిజమైతే 420 సంవత్సరాల క్రితం ఏర్పాటైనట్లు గుర్తించేందుకు అవకాశం ఉంది. అంటే కుతుబ్షాలు నిర్మించారా? లేక అంతకంటే ముందు గోల్కొండ కోటను నిర్మించిన కాకతీయులు ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారా? అనేది తేలాల్సి ఉంటుంది. కాకతీయుల కాలంలో నిర్మాణమైన గోల్కొండ కోటపై కుతుబ్షాహిలు దండ యాత్ర చేసి కొంత ధ్వంసం చేయడమే కాకుండా కోటను ఆక్రమించి పరిపాలన సాగించారు.