రుణాలే యమపాశం?: రైలు కింద పడి ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం ఆత్మహత్య
వరంగల్: బ్యాంకు నుంచి రుణాలందుకున్న వ్యక్తులంతా తిరిగివ్వకుండా ముఖం చాటేయటం, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, అపరాధ భావం.. వెరసి ఆంధ్రాబ్యాంక్లో ఏజీఎంగా పని చేస్తున్న ఓ అధికారిని ఆత్మహత్యకు పాల్పడేలా చేశాయి. సోమవారం వరంగల్లో ఆయన రైలు కిందపడి ప్రాణం తీసుకున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన కృష్ణమూర్తి నాగరాజన్ (59) వరంగల్ జిల్లా హన్మకొండలోని ఆంధ్రాబ్యాంక్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. భార్య రాధతో కలిసి హన్మకొండలోనే ఉంటున్నారు.
అయితే, ఏడాది క్రితం వరకు ఆయన కోల్కతాలో పనిచేశారు. ఆ సమయంలో చాలమందికి సిఫారసు చేసి రుణాలు మంజూరుచేశారు. ఆ తర్వాత వారు అర్హులు కాదని తెలిసింది. కాగా, రుణాలు పొందినవారూ తిరిగి చెల్లించడం లేదు. ఈలోగా బదిలీపై హన్మకొండకు వచ్చారు నాగరాజన్. అయినా రుణాల విషయమై బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి.
అంతేగాక, 'మీరు రుణాలు ఇచ్చిన వారు చెల్లించడం లేదు' అంటూ తరచూ నిలదీస్తున్నారు. ఈ ఒత్తిళ్లను ఆయన తట్టుకోలేకపోయారు. తరచూ భార్యతో చర్చిస్తూ బాధపడేవారు. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తి సోమవారం వరంగల్ రైల్వేగేటు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
మృతుడి పర్సులో లభించిన కాగితంలో 'కోల్కత్తాలో రుణాలను తీసుకున్నవారు చెల్లించడం లేదు, తప్పుచేశాను. బ్యాంకుకు నష్టం కలిగించాను' అని రాసుందని రైల్వే ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.