కెసిఆర్ను చూసి ఆంధ్ర ప్రజలు సంతోషించారు: కర్నె ప్రభాకర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును చూసి ఆంధ్ర ప్రజలు సంతోషించారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. పొరుగు రాష్ట్రాలు బాగుండాలని తాము కోరుకునేవాళ్లమని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. అమరావతిలో కెసిఆర్ కనిపించగానే ఆంధ్ర ప్రజల్లో ఆనందం కనిపించిందని ఆయన అన్నారు.
సరిహద్దు రాష్ట్రాలతో భవిష్యత్తులో కూడా సఖ్యతను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో స్కీములన్నీ స్కాములుగా మారాయని ఆయన విమర్శించారు. పేద ప్రజలకు ఇండ్లు కట్టిస్తుంటే కాంగ్రెస్ ఓర్చుకోలేక పోతుందని ప్రభాకర్ విమర్శించారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు.
రాష్ర్టాభివృద్ధిని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, దసరా సందర్భంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. ఈ ఏడాది 60 వేల ఇళ్లను నిర్మించాలని చిత్తశుద్ధితో ఉన్నామని, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రజలు ఇంకా పేదలు ఉండాలని కాంగ్రెసు వాళ్లు కోరుకుంటున్నారని, దిగ్విజయ్సింగ్ అనవసర విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ర్టాభివృద్ధి దిగ్విజయ్సింగ్కు కనబడకపోవడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని కర్నె ప్రభాకర్ అన్నారు. నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. రైతు రుణమాఫీ చేసింది కనబడటం లేదా అని ప్రశ్నించారు.