పట్టిసీమ నీళ్లు మాకివ్వాలి: ప్రాజెక్ట్ కట్టిన బాబుకు కేసీఆర్ షాక్
న్యూఢిల్లీ: పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఎనబై టీఎంసీల గోదావరి నీటిని ఏపీ మళ్లిస్తుందని, ఇది పోలవరంలో భాగం కాదని పార్లమెంటులో కూడా ప్రకటన చేసిందని, ఈ నీటితోపాటు పోలవరం ద్వారా మళ్లించే నీటిలో కూడా తమకు వాటా రావలసి ఉందని తెలంగాణ శనివారం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించింది.
పట్టిసీమ నుంచి మళ్లించే నీటిలో మహారాష్ట్ర, కర్ణాటకలు కూడా వాటా అడగడానికి అవకాశముందన్నారు. గోదావరి జలాలను ఒక బేసిన్ నుంచి మరో బేసిన్కు మళ్లిస్తే ఎగువ రాష్ట్రాలకు ఆ నీటిలో వాటా ఉంటుందని తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్ అన్నారు.
సీక్రెట్ కాపీ!: 'ఏపీ చోరీపై సమాధానం చెప్పలేకపోయిన తెలంగాణ'
పట్టిసీమ ద్వారా మళ్లిస్తున్న 80 టీఎంసీల నీటిలో ఎగువ రాష్ట్రాలకు ఎంత కేటాయించాలో ట్రైబ్యునల్ నిర్ణయించాలని, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ నీటిని వాడుకునే హక్కు ఏపీకి లేదన్నారు. కృష్ణా జలాల వివాదం ఒక్కసారి వచ్చి ఒక్కసారే పరిష్కారమయ్యేది కాదన్నారు.
రెండు రాష్ట్రాలు అంటే సెక్షన్-84తోనే కేంద్రం సరిపెట్టేదని, సెక్షన్-89 ఉద్దేశం నాలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీ కేటాయింపు, ఆపరేషన్ ప్రోటోకాల్ ఉండాలని అర్థమని ఆయన శనివారం వివరించారు. కొత్తగా కేటాయింపుల్లో ముందుగా కృష్ణా బేసిన్ అవసరాలకు ఇచ్చిన తర్వాతే బయటి ప్రాంతాలకు ఇవ్వాలన్నారు.
మొదటి ట్రైబ్యునల్ చేసిన కేటాయింపులు మారవని, రెండో ట్రైబ్యునల్ చేసిన పంపిణీలో అసమానతలు చోటు చేసుకొన్నాయని, ఇందులో మార్పులు చేయడానికి నాలుగు రాష్ట్రాల భాగస్వామ్యంతో వాదనలు జరగాల్సిందేనన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తుందని, రైతుల పేరుతో సుప్రీం కోర్టులో కేసులు వేయించిందని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదన్నారు.
ఏపీ తరఫున లాయర్ గంగూలీ వాదనలు వినిపిస్తూ... నీటి కేటాయింపుల్లో మార్పులు చేయమనడం లేదని, ఎక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు ఎవరికీ నష్టం ఉండదని, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు దిగువ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందన్నారు.
బీజేపీ దాడి, దెబ్బకొట్టేందుకు జగన్-కేసీఆర్: బాబు వ్యూహరచన
గతంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు దిగువ రాష్ట్రాలకు మిగులు జలాలను వినియోగించుకొనే అవకాశం ఉండేదని, ఇప్పుడు మొత్తం నీటిని పంపిణీ చేశారని, లభ్యత తక్కువగా ఉన్నపుడు ఎగువ రాష్ట్రాలకు నష్టం ఉండదని, దిగువ రాష్ట్రాలకే ఇబ్బందని పేర్కొన్నారు.
తక్కువ ఉన్నప్పుడు కూడా దీనికి తగ్గట్లుగా వినియోగం జరిగే పద్ధతి లేకుంటే దిగువ రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. ఇలాంటి సమయంలో ఏ ప్రాజెక్టులో ఎంత వినియోగించుకోవాలో నిర్ణయించాలని, ఇది జరగాలంటే నాలుగు రాష్ట్రాలను భాగస్వాములుగా చేయాలన్నారు.
కాగా, పునర్విభజన చట్టంలోని సెక్షన్-84 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసుకోవచ్చు కదా అని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ పేర్కొంది. దీనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విభేదించాయి. 4 రాష్ట్రాల మధ్య పంపకం కావాలనే సెక్షన్ 89 చెప్పారన్నారు.
పునర్విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశమన్నాయి. ఏపీ విభజన చట్టం మేరకు గడువు పొడిగించిన బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ రెండు రాష్ట్రాలకా లేక నాలుగు రాష్ట్రాలకా అన్నదానిపై వాదనలు జరిగాయి. అనంతరం ఆగస్టు 16, 17, 18వ తేదీలలో విచారణ జరగనుంది.