అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు -ఏపీ,తెలంగాణ ఆర్టీసీల మధ్య ఒప్పందమిదే -సర్వీసులు ఇలా..
ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ బస్సులు నడవనున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులపై ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు వీడింది. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు ఎట్టకేలకు సోమవారం ఫలించాయి. సర్వీసులు ఎలా నడపాలనేదానిపై ఒప్పందం కుదరడంతో ఈ అర్ధరాత్రి నుంచే బస్సులు రోడ్డెక్కనున్నాయి.
Recommended Video
ఏపి ఆర్టీసికి తీవ్ర నష్టం.!ఐనా తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకారం.!మంగళవారం నుండి బస్సులు తిరిగే ఛాన్స్.
లాక్ డౌన్ సమయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు నిలిచిపోగా, అన్ లాక్ తర్వాత కూడా సర్వీసులు పునరుద్ధరణ కాలేదు. పలు దఫాల విఫల చర్చల తర్వాత ఎట్టకేలకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సోమవారం ఒక అవగాహనకు వచ్చారు. కుదిరిన ఎంవోయూ మేరకు..
టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులు ఆంధ్రప్రదేశ్ లో భూభాగంలో 1,61,258 కిలోమీటర్ల మేర తిరగనున్నాయి. అదే సమయంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులు తెలంగాణలో 1,60,999 కిలోమీటర్ల మేర తిరిగేందుకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో ఒప్పందంపై ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు.
తాజా ఒప్పందంలో భాగంగా.. ఏపీ నుంచి తెలంగాణకు 638 బస్సులు తిరుగుతాయి. లాక్ డౌన్ కు ముందు ఈ సంఖ్య 1009గా ఉండేది. తాజా ఒప్పందం తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి 820 బస్సులు తిరుగుతాయి. గతంలో ఈ సంఖ్య 750గా ఉండేది. తనకు నష్టం కలుగుతోందని తెలిసినా ఏపీఎస్ఆర్టీసీ ఈ ఒప్పందానికి అంగీకరించడం గమనార్హం.