షాకింగ్: కరోనా వ్యాక్సిన్ వల్లే చనిపోయింది -కాసిపేట అంగన్వాడీ కార్యకర్త మృతిపై బంధువులు
కరోనా మహమ్మారి నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ ఫ్రంట్ లైన్ వారియర్లే బాధితులవుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ వల్ల చనిపోయారని ఆరోపణలు రాగా, తాజాగా మరో అంగన్వాడీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మరణానికి కారణం వ్యాక్సిన్ ప్రభావమే అని అధికారులు నిర్ధారించలేదు. వివరాల్లోకి వెళితే..
అంగన్వాడీ కార్యకర్త అయిలి సుశీల
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కాసిపేటకు చెందిన అంగన్వాడీ కార్యకర్త అయిలి సుశీల (48) మృతిపై ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగురాలు కూడా అయిన సుశీల.. గత వారం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ఆరోగ్యం క్షీణించిందని వారు చెబుతున్నారు. కాగా, జిల్లా అధికారుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది..
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో..
ఈనెల 23న మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత సుశీల అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి ఇంకా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను శనివారం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మరణించారు. దీనిపై..
దీర్ఘకాలిక వ్యాధుల వల్లా?
అంగన్వాడీ కార్యకర్త సుశీల మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, ఈ ఘటనపై జిల్లా వైద్య అధికారులు స్పందించారు. సుశీలకు దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం వల్లనే ఇబ్బంది కలిగి ఉంటుందని మెడికల్ ఆఫీసర్ కిరణ్మయి అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై ప్రభుత్వం తరఫున అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
టీకాల సేఫ్టీపై అనుమానాలు
తెలంగాణలో వ్యాక్సిన్ కారణంగా ఆరోగ్య కార్యకర్తలు చనిపోయారనే అనుమానాలు వ్యక్తం కావడం ఇది మూడోసారి. తొలుత.. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఒలా గ్రామానికి చెందిన 108 అంబులెన్స్ డ్రైవర్ విఠల్ రావు, గత వారం వరంగల్ అర్బన్ జిల్లా శాయంపేటకు చెందిన అంగన్వాడీ హెల్త్ వర్కర్ వనిత, ఇప్పుడు మంచిర్యాల జిల్లాకు చెందిన అంగన్వాడీ కార్యకర్త సుశీలల మరణాలకు వ్యాక్సినే కారణమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం మాత్రం మరణకారణాలను నిర్ధారించలేదు. రాష్ట్రంలో శనివారం నాటికి ప్రభుత్వ, ప్రైవేటు వారియర్లు అంతాకలిపి 1,68,589 మందికి టీకాలు వేశారు.