ఇంటి దొంగ! అత్తింటికే కోడలు కన్నం: 2 కిలోల బంగారం, కారు, 4 సెల్ఫోన్లు చోరీ, భారీ స్కెచ్
హైదరాబాద్: ఇంటి దొంగను పట్టుకోవడం ఈశ్వరుడి తరం కాదనే సమేత ఉన్న విషయం తెలిసిందే. అందుకే సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఓ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం ఛేదించేందుకు పోలీసులకు కాస్తా సమయం పట్టింది. ఎందుకంటే ఆ ఇంట్లో దొంగతనం చేసింది ఆ ఇంటికి కోడలుగా వచ్చిన మహిళే కావడం గమనార్హం. అత్తపై ప్రతీకారం తీర్చుకునేందుకే కోడలు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది.
పెళ్లైన నాలుగు నెలలకే భర్తతో విభేదాలు..
ఈ భారీ దొంగతనంకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు తెలిపారు. కామారెడ్డి వాసి అయిన కొల్లూరి శ్రీనివాస్ తన కుమార్తె సుప్రియను సికింద్రాబాద్ పాతబోయిన్పల్లి మల్లిఖార్జున్నగర్కు చెందిన వడ్డీ వ్యాపారి సరళ కుమారుడు ధీరజ్తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. కాగా, పెళ్లైన నాలుగు నెలలకే సుప్రియ, ధీరజ్ల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వచ్చాయి. ఇందుకు కారణం తన అత్తనే అని భావించిన సుప్రియ.. అత్త సరళపై ఆగ్రహం వ్యక్తం చేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
అత్తే కారణమంటూ..
ఆ తర్వాత తన అత్తపై ప్రతీకారం తీసుకోవాలని అనుకుంది. ఆ తర్వాత దసరా పండుగకు మళ్లీ మెట్టినింటికి వెళ్లిన సుప్రియ.. మరోసారి అత్తతో వాగ్వాదం చేసింది. ఆ తర్వాత మళ్లీ పుట్టింటికి తిరిగి వచ్చేసింది. అంతేగాక, పుట్టింటికి వచ్చేటప్పుడు అత్తింటి తాళం చెవిని కూడా తీసుకొచ్చింది. అత్తపై ప్రతీకారం తీసుకుంటానని, తనకు సహకరించాలని తల్లిదండ్రులు సునీత, శ్రీనివాస్, సోదరుడు సాత్విక్లను కోరింది సుప్రియ. దీనికి వారు కూడా అంగీకరించారు.
దొంగలు పడ్డట్లు నమ్మించేందుకు..
ఈ క్రమంలో తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి అక్టోబర్ 21న హైదరాబాద్ వచ్చింది. అత్త ఇంటి పరిసరాల్లో మాటువేసింది. సరళ బయటకు వెళ్లగానే సుప్రియ, సాత్విక్లు మారుతాళంచెవితో తాళం తీసి అత్తింట్లోకి ప్రవేశించారు. బంగారు ఆభరణాలు, వెండిని సంచిలో వేసుకున్నారు. ఆ తర్వాత దొంగలు పడ్డారని నమ్మించేందుకు దుస్తులను చిందరవందరగా చేశారు. పడకగది తలుపు తెరిచారు. బయటకు వచ్చేటప్పుడు ప్రధాన ద్వారంకు గొళ్లెం కూడా వేయకుండా వదిలేసి పరారయ్యారు.
అత్త ఫిర్యాదుతో..
సాయంత్రం ఇంటికి వచ్చిన సరళ.. బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయని గుర్తించి.. అదేరోజు రాత్రి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఇంటి కోడలే దొంగతనంకు పాల్పడిందని తేల్చారు. సుప్రియతోపాటు ఆమె తల్లిదండ్రులు సునీత, శ్రీనివాస్, సోదరుడు సాత్విక్లను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 2 కిలోల బంగారు ఆభరణాలు, 6.75 కిలోల వెండి వస్తువులు, కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.