కోడెల మృతి కేసులో కొత్త మలుపు!: 'పిరికివాడు కాదు.. ఏదో మిస్టరీ ఉంది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి దాఖలు చేశారు. కోడెల ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, కోడెల మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు కూడా గురువారం గవర్నర్ను కలిసిన తర్వాత కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
కోడెల చివరి ఫోన్ కాల్ గన్మెన్కు, సీబీఐ విచారణకు టీడీపీ డిమాండ్
కోడెల పిరికివాడు కాదు...
కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అనిల్ చెప్పారు. ఆయన విచారణలకు, కేసులకు భయపడే వ్యక్తి కాదన్నారు. ఆయన ఓ డాక్టర్ అని, అలాంటి వ్యక్తి ఇలాంటి దారుణానికి పాల్పడుతారని తాను భావించానని చెప్పారు. దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. ఆయన మృతికి సంబంధించి ఆయన పీఏ, గన్మెన్లను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు.
చంద్రబాబుపై ఆగ్రహం..
అంత్యక్రియల సమయంలో విక్టరీ సింబల్ చూపించడం ఏమిటని చంద్రబాబుపై అనిల్ మండిపడ్డారు. తమ వద్ద ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. తొలుత మృతి, ఆ తర్వాత ఆత్మహత్య అంటూ చెప్పారని, దీని వెనుక ఏదో మిస్టరీ ఉందని, కాబట్టి సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజానిజాలు తేలుతాయని చెప్పారు.
మేం కోడెల అభిమానులం..
తాము కోడెల శివప్రసాద రావు అభిమానులమని అనిల్ చెప్పారు. అందుకే ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వచ్చామన్నారు. ఇది రాజకీయ కుట్ర, రాజకీయ హత్య అన్నారు. ఈ హత్య వెనుక ఎవరు దాగి ఉన్నా సీబీఐ విచారణ ద్వారా బయటపడుతుందన్నారు. కోడెల కొడుకును కూడా విచారించాలన్నారు. సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందని చెప్పారు. కోడెల శివప్రసాద రావు చనిపోవడం వెనుక ఆయన కొడుకు హస్తం కూడా ఉండి ఉండవచ్చునని అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.