కాంగ్రెస్లో చిచ్చురేపిన అజహరుద్దీన్ వ్యాఖ్యలు: భగ్గుమన్న అంజన్ యాదవ్, హెచ్చరిక
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ ప్రకటించడం ఆ పార్టీలో విభేదాలకు తెరలేపింది.
అజరుద్దీన్కు వ్యతిరేక నినాదాలు
అజారుద్దీన్ ప్రకటనను నిరసిస్తూ సోమవారం జరిగిన సమావేశంలో అంజన్ కుమార్ యాదవ్ వర్గం ఆందోళనకు దిగడంతో రసాభాసగా మారింది. ఏఐసీసీ ఇంఛార్జి బోస్ రాజు ముందే అంజన్ అనుచరులు అజారుద్దీన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోటీకి ఎవరు వచ్చినా ఊరుకొనేది లేదని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్ హెచ్చరించారు. అజరుద్దీన్ అసలు ఇక్కడివారే కాదని అన్నారు.
భగ్గుమన్న అంజన్.. సర్వే హామీ
సికింద్రాబాద్ నుంచి తానే పోటీచేస్తానని అంజన్ స్పష్టంచేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఈ సీటు ఇంకెవరికైనా ఇస్తామని ప్రకటించలేదు కదా? చెప్పారు. అజహరుద్దీన్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తాననని ఆయనే చెప్పుకుంటున్నారన్నారు. చాతనైతే అజారుద్దీన్ హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని, అలా చేస్తే తాము కూడా సహకరిస్తామని అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు. గ్రేటర్ కాంగ్రెస్ నేతల సమావేశంలో గొడవ ముదరడంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సర్వే సత్యనారయణ సర్థి చెప్పారు. సికింద్రాబాద్ స్థానం అంజన్దేనని సర్వే సత్యనారాయణ తెలిపారు.
విభేదాలు బహిర్గతం
మరోవైపు సమావేశంలో అంజన్కుమార్ యాదవ్ మాట్లాడుతుండగా వీ హనుమంతరావు లేచి వెళ్లిపోయారు. ఈ సమావేశానికి ముఖేశ్ గౌడ్తో పాటు పలువురు నగర కాంగ్రెస్ నాయకులు హాజరు కాకపోవడం గమనార్హం.
అసలు అజహరుద్దీన్ ఏమన్నారంటే..
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్పై సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తాను సొంత రాష్ట్రం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారని ఓ మీడియాతో మాట్లాడుతూ అజహరుద్దీన్ వ్యాఖ్యానించారు. 'నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు, గ్రామాల్లో పర్యటించాను. ప్రజలు, రైతులతో మాట్లాడాను. వారంతా సికింద్రాబాద్ నుంచే పోటీ చేయాలని చెప్పారు' అని అజహరుద్దీన్ వివరించారు.