అలర్ట్.. అలర్ట్ .. తెలుగురాష్ట్రాల్లో మరో రెండురోజులు వానలు..
హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో మరో రెండురోజులు వర్షం కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ సహా పట్టణాలు, గ్రామాల్లో ముసురు వాతావరణం నెలకొంది. మరో రెండురోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో .. వాయవ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమైందని అధికారులు పేర్కొన్నారు. ఒడిశాకు ఆగ్నేయ దిశగా 160 కిలోమీటర్ల దూరంలో ఉందని .. వచ్చే 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో పలుచోట్ల తేలికపాట జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. మంగళ, బుధ, గురువారాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
మంగళవారం తెలంగాణలో మోస్తరు .. బుధవారం పలుచోట్ల వర్షం కురుస్తోందని వివరించారు. గురువారం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ఈ రెండురోజులు ఒకటి, రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాయలసీమలో బుధ, గురువారాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొన్నారు.