శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో మళ్లీ ప్రమాదం - పరుగులు తీసిన ఉద్యోగులు - విద్యుత్ సరఫరా ఆపడంతో..
తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన భారీ ప్రమాదంతో ఈ కేంద్రంలో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా.. బుధవారం అనూహ్య ఘటన సంభవించింది.
విద్యుత్ కేంద్రంలోకి సామాగ్రిని తీసుకెళుతోన్న ఓ లారీ.. పక్కనే ఉన్న విద్యుత్ కేబుళ్లపై దూసుకెళ్లగా.. పెద్ద శబ్దాలతో మంటలు చెలరేగాయి. ఆ దృశ్యాలు చూసి అక్కడున్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కొద్ది నిమిషాలపాటు ఒక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విద్యుత్ కేబుళ్లపైకి లారీ దూసుకొచ్చి, మంటలు చలరేగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు.. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సకాలంలో ఆ పని చేసి ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పినట్లయింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు తాజా ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
పది రోజుల కిందట ఇదే ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా తలెత్తిన భారీ ప్రమాదంలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశమైన ఆ సంఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణా సర్కార్.. సిఐడి విచారణకు ఆదేశించింది. గత ప్రమాదం తాలూకు నష్టాన్ని పునరుద్ధరిస్తున్న క్రమంలోనే తాజా ప్రమాదం చోటుచేసుకుంది.
'మిషన్ కర్మయోగి'కి మోదీ కేబినెట్ ఆమోదం - సివిల్ సర్వీసుల్లో భారీ ప్రక్షాళన
శ్రీశైలం రిజర్వాయర్ వద్ద మంగళవారం రాత్రి కూడా మరో ఘటన జరిగింది. డ్యాం ప్రవేశ ద్వారం వద్ద కొండ చరియలు విరిగిగిపడి, బండరాళ్లు రోడ్డపైకి వచ్చిపడ్డాయి. ఆ మార్గంలోనే ఉద్యోగులు, పర్యాటకులు నిరంతరం రాకపోకలు కొనసాగిస్తారు. కాగా, కొండచరియలు విరిగిపడిన రాత్రి సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది.