పబ్జీ గేమ్ కు మరో బాలుడు బలి...తల్లిదండ్రులు ఆడొద్దన్నారని ఆత్మహత్య
పబ్జీ .. ఇప్పుడు దేశవ్యాప్తంగా యువతను బానిసలుగా చేస్తూ, బలి తీసుకుంటున్న గేమ్ . తరచూ ఈ ఆటవల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు చదువు పక్కనపెట్టి పబ్జీ ఆటపై చూపిస్తున్న ఆసక్తి అంతా ఇంతా కాదు . వద్దని తల్లిదండ్రులు వారిస్తే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు .
విద్యార్థుల బంగారు భవిష్యత్ ను నాశనం చేస్తున్న పబ్జీ
పబ్జీ గేమ్ ... ఇప్పుడు యువతకు ఒక డేంజర్ వైరస్ లా పట్టుకున్న గేమ్. చదువుల సైతం పక్కనపెట్టి ఎప్పుడు చూసిన చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని ఈ గేమ్ మత్తులో పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు యువత. అంతేకాదు తల్లిదండ్రులు వద్దని చెప్పినా వినిపించుకోకుండా, పక్క ప్రపంచంతో సంబంధమే లేనట్టు ఈ గేమ్ మోజులో పడి కొట్టుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ గేమ్ కు బానిసలవుతున్నారు. అంతేకాదు పబ్జీ మోజులో పడి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
పబ్జీ గేమ్ కోసం ఉరి వేసుకుని ఆత్మహత్య .. తల్లిదండ్రులకు కడుపు కోత
పబ్జీ ఆట వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నిజామాబాద్ లో ఒక తొమ్మిదో తరగతి బాలుడు తల్లి పబ్జీ ఆడొద్దు అని మందలించిందని ఆత్మహత్య చేసుకున్నాడు. అదేపనిగా పక్క ప్రపంచంతో సంబంధం లేకుండా పబ్జీ ఆడుతున్న ఆ బాలుడ్ని తల్లి ఫోన్ పక్కన పడేసి చదువుకోమని మందలించింది. తల్లి కోపగించుకోవటంతో అలిగిన బాలుడు గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నాడు . ఎంతసేపటికీ ఆ బాలుడు తలుపు తియ్యకపోవటంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టటంతో ఉరేసుకుని ఆ బాలుడు విగత జీవిగా కనిపించాడు . అయినా ఆస్పత్రికి తీసుకెళ్ళారు తల్లిదండ్రులు. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు . దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు . తరచూ జరుగుతున్న ఈ తరహా విషాద ఘటనలు యువత ఎంతగా పబ్జీ గేమ్ కు అడిక్ట్ అవుతున్నారో తేటతెల్లం చేస్తున్నాయి.