నగరంలో మరో వ్యాపారి దారుణ హత్య, మహిళా వడ్డీ వ్యాపారి అదృశ్యం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో వ్యాపారి హత్యకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం రాంకోఠిలో బైకుల వ్యాపారిని అతడి ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు.
అదే తరహాలో సోమవారం రాత్రి బోరబండలోనూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న సోమశేఖర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటన కూడా రాత్రి నడిరోడ్డు పైనే చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకుని విచారణ చేపట్టారు.
నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కాగా, ఆర్థిక విభేదాలతోనే ఈ హత్య జరిగిందని సోమశేఖర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమశేఖర్ స్నేహితుడు హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు.
రామంతాపూర్లో వడ్డీ వ్యాపారి మంజుల అదృశ్యం
రామంతాపూర్లో వడ్డీ వ్యాపారి మంజుల అదృశ్యమయ్యారు. రామంతాపూర్లో తల్లిదండ్రుల వద్దకు వచ్చిన మంజులకు రుణం మొత్తం చెల్లిస్తామని ఫోన్ రావటంతో వసూలు కోసం వెళ్లిన మంజుల అదృశ్యమయ్యారు. మంజుల అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వడ్డీ వ్యాపారి మంజుల తన భర్తతో కలిసి బంజారాహిల్స్లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
శిశువును వదిలి వెళ్లిన తల్లి
నల్గొండ జిల్లా సూర్యాపేటలో తల్లి శిశువును వదిలివెళ్లింది. జామాయిల్ తోటలో నెలన్నర వయసున్న శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు 108 వాహనంలో శిశువును ఆసుపత్రికి తరలించారు.