ఇంటర్ బోర్డులో మరో కలకలం ... పోలీస్ స్టేషన్ లో సప్లమెంటరీ ప్రశ్నాపత్రాలు మాయం
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న ఇంటర్ బోర్డుని ఇప్పుడు ఇంకో కలకలం వేధిస్తోంది.. ఫలితాల విషయంలో తీవ్ర అవకతవకలతో అబాసుపాలైన బోర్డు తాజాగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల విషయంలోనూ అభాసుపాలవుతుంది . తాజాగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాలను భద్రపరచడంలోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాతంతో ప్రశ్నాపత్రాలు మాయమయ్యాయి.
వరంగల్ పోలీస్ స్టేషన్ లో సప్లమెంటరీ ప్రశ్నాపత్రాల మాయం
ఈ నెల 7 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్కు ఇటీవలే సప్లిమెంటరీ ప్రశ్నాపత్రాలు వచ్చాయి. అయితే అందులో ప్రశ్నాపత్రాలకు సంబంధించిన రెండు బాక్సులు కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా ఇంటర్బోర్డు కస్టోడియన్ రెండు రోజుల క్రితం వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్లలో భద్రపరిచిన ప్రశ్నపత్రాల సీల్డ్బాక్సులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో రెండు బాక్సులు గల్లంతైనట్లు గుర్తించారు. దీంతో విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు .
మాయమైన ప్రశ్నాపత్రాల కోసం రహస్య విచారణ చేస్తున్న పోలీసులు, ఇంటర్ అధికారులు
పోలీస్ స్టేషన్ కు ప్రశ్నపత్రాల బాక్సులను తరలించడానికి ముందు వాటిని భద్రపరిచిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) కార్యాలయంలో, శంభునిపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. ఇక పోలీస్ స్టేషన్ ను సైతం జల్లెడ పట్టారు. కానీ ఇంతవరకు రెండు బాక్సులు ఏమయ్యాయో తెలియలేదు. రెండు రోజులుగా ఇంటర్ బోర్డు అధికారులు, పోలీసులు బాక్సుల కోసం రహస్యంగా గాలిస్తున్నారు. అంతేకాకుండా ప్రశ్నపత్రాల గల్లంతుపైనా రహస్య విచారణ చేపట్టారు. ఎక్కడా వాటి జాడ దొరక్కపోవడంతో పోలీసులు, ఇంటర్ బోర్డు అధికారులు టెన్షన్ పడుతున్నారు.
ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డ అడ్వాన్స్డ్ సంప్లమెంటరీ పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమయంలో ప్రశ్నాపత్రాల బాక్సులు మిస్ కావడంతో అటు పోలీసులు ఇటు జిల్లా విద్యాశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రశ్నాపత్రాల మాయం విషయంలో అన్నీ ప్రశ్నలే ?
అసలు ప్రశ్నా పత్రాల బాక్సులు ఏమైనట్టు? వాటిని మాయం చేసింది ఎవరు ? ఎక్కడైనా పొరబాటున మిస్ అయ్యాయా ? లేకా కావాలనే ఎవరైనా వాటిని దొంగిలించారా ? పరీక్షలు నిర్వహించాల్సిన ప్రశ్నా పత్రాలు కావున అవి దొరకకపోతే పరీక్షల నిర్వహణ జరుగుతుందా? ప్రశ్నా పత్రాల మార్పు చేస్తారా ? ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థులకు, అటు తల్లిదండ్రులకు కలుగుతున్నాయి. ఏది ఏమైనా పరీక్షల నిర్వహణకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది విద్యార్థులకు పనిష్మెంట్ లా మారుతుంది. ఏది ఏమైనా అంతు చిక్కకుండా పోయిన సప్లమెంటరీ ప్రశ్నాపత్రాల మాయం వెనుక కారణాలను పోలీసులు త్వరలోనే ఛేదిస్తారని ఆశిద్దాం .