నల్గొండలో మరో దారుణ హత్య: ముక్కలు ముక్కలైన కాంగ్రెస్ నేత..
నల్గొండ: నల్గొండ జిల్లాలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా మున్పిపల్ చైర్పర్సన్ భర్త, కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్య ఘటన ఇంకా తెరపై ఉండగానే.. మరో హత్య చోటు చేసుకోవడం గమనార్హం. నాటు బాంబులతో అత్యంత కిరాకతకంగా అతన్ని హత్య చేసినట్టు తెలుస్తోంది.
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య: 9 మంది అరెస్ట్, మిర్చిల బండి వివాదమే కారణం
ఎవరతను?:
జిల్లాలోని తిరుమలగిరి మండలం, చింతలపాలెం గ్రామ ఉప సర్పంచ్, కాంగ్రెస్ నేత ధర్మానాయక్పై నాటుబాంబు దాడి జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఆయన నిద్రిస్తున్న సమయంలో.. గర్తు తెలియని దుండగులు మంచం కింద నాటుబాంబులు పెట్టారు.
ముక్కలైన శరీరం..:
నాటు బాంబులు ఒక్కసారిగా పేలడంతో.. ధర్మానాయక్ శరీరం ముక్కలు ముక్కలుగా తెగిపడింది. ఉపసర్పంచ్ ధర్మానాయక్ హత్య చింతలపాలెం ప్రజల్లో భయాందోళనల్ని నింపింది. హత్యానంతరం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
పాత కక్షలేనా?..:
పాత కక్షల కారణంగానే ధర్మానాయక్ హత్యకు గురై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఊళ్లో వాళ్లే ఈ హత్యకు పాల్పడ్డారా?.. అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది రాజకీయ కోణంలోనే జరిగిందా.. కేవలం వ్యక్తిగత కక్షలేనా? అన్నది ఆసక్తికరంగా మారింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నట్టు సమాచారం.
బొడ్డుపల్లి హత్యపై వెనక్కి తగ్గని కోమటి బ్రదర్స్..:
ఇక ఇటీవలే చోటు చేసుకున్న బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య ఉదంతం కూడా నల్గొండలో పెద్ద దుమారమే లేపింది. కాంగ్రెస్ నాయకులంతా టీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపిస్తుండగా.. పోలీస్ వర్గాలు మాత్రం ఇది రాజకీయ హత్య కాదని తేల్చేశారు.
దీంతో ఈ కేసును జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కోమటిరెడ్డి బ్రదర్స్ ఆలోచిస్తున్నారు. సీబీఐ డైరెక్టర్కు దీనిపై ఫిర్యాదు చేయడమే కాకుండా.. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు కూడా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.