రంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన ..బ్రిడ్జి క్రింద బట్టలు లేకుండా.. యువతి అత్యాచారం, హత్య
మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి . గత ఏడాది దేశంలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైన దిశా అత్యాచారం, హత్య ఘటన ఇంకా తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోకముందే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో మరో దారుణం చోటు చేసుకుంది. తంగడపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి కింద ఒక యువతి మృతదేహం కలకలం రేపుతుంది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని బండ రాయితో మోది హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది .
తంగడపల్లి వంతెన కింద గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే హత్యకు గురైన యువతి సాఫ్ట్ వేర్ ఎంప్లాయి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆమె శరీరంపై బట్టలు గానీ , ఆమె కు సంబంధించిన వస్తువులు కానీ సంఘటనా స్థలంలో లభించలేదు.
Recommended Video
ఇక ఆమె మృతదేహం నగ్నంగా ఉండటం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో అత్యాచారం చేసి ఆతర్వాత హత్యచేసి ఉంటారని అంతా భావిస్తున్నారు. అసలు ఇంతకీ ఆమె ఎవరు ? ఏమిటి ? అనే వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. మిస్సింగ్ కేసుల ఆధారంగా కేసు విచారిస్తున్న పోలీసులు రాష్ట్రంలోని మిగతా పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది.