మరో ఘటన: ప్రియుడి మోజులో గొంతు కోసి భర్తను చంపిన భార్య
వేములవాడ: ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్యల జాబితాలో మరో మహిళ చేరింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ మహిళ తన భర్తను గొంతు కోసి హత్య చేసింది.
భర్తను దైవదర్శనానికి తీసుకుని వచ్చి మరీ ఆలయ సమీపంలోనే గొంతు కోసి హత్య చేసింది. పిల్లలను ఇంటి వద్ద ఉంచి భర్తను వేములవాడ దైవదర్శనానికి తీసుకుని వచ్చి పక్కా ప్రణాళిక ప్రకారం మహిళ తన భర్తను హత్య చేసింది.
ఆ కుటుంబం ఇలా...
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ఘణపూర్కు చెందిన బండి బాలయ్య(40) నర్సవ్వ భార్యాభర్తలు. వీరికి శైలజ(17), అంజలి(7) అనే కూతుళ్లు ఉన్నారు. జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లిన బాలయ్య 20 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. మళ్లీ గల్ఫ్ వెళ్లకూడదని అతను నిర్ణయించుకున్నాడు. అయితే, అప్పులు తీరాలంటే గల్ఫ్ వెళ్లాల్సిందేనని నర్సవ్వ పట్టుబట్టింది. దీంతో ఇరువురి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
ఆమెకు వివాహేతర సంబంధం
నర్సవ్వకు గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం ఉందని, దానివల్లనే భర్తను తిరిగి గల్ఫ్ వెళ్లాలని ఒత్తిడి చేస్తూ వచ్చిందని అంటున్నారు. అయితే, భర్త నిరాకరించడంత అతన్ని అడ్డు తొలగించుకోవడానికి పక్కా ప్రణాళిక వేసింది. పిల్లలను ఇంటి వద్దే ఉంచి దైవదర్శనం కోసమని ఆదివారం వేములవాడకు భర్తతో కలిసి వచ్చింది.
గది అద్దెకు దొరక్క..
భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అద్దెకు గది దొరకలేదు. దాంతో గుడి చెరువు ప్రాంతంలో విఐపి పార్కింగ్ స్థలంలో ఉన్నారు. ఇద్దరు కలిసి మద్యం తాగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు గొడవ పడ్డారని సమాచారం. ఆ తర్వాత బాలయ్యయ నిద్రపోయాడు.
నిద్రపోయిన భర్తను ఇలా.
రాత్రి దాదాపు 11 గంటలు దాటిన తర్వాత నిద్రలో ఉన్న భర్త బాలయ్యను తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసింది. బాలయ్య గట్టిగా అరవడంతో సమీపంలోని భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే బాలయ్య రక్తపుమడుగులో పడి ఉన్నాడు. నర్సవ్వను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సంఘటనా స్థలంలో కత్తులు...
రెండు పదునైన కత్తులను సంఘటన స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నర్సవ్వ ఒక్కతే బాలయ్యను గొంతు కోసి చంపిందా, మరెవరి పాత్రనైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అతని ఇంటి ముందు ధర్నా...
బాలయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి బంధువులకు అప్పగించారు. వారు శవంతో వెంకటరెడ్డి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. తండ్రి శవాన్ని చూసి ఇద్దరు కూతుళ్లు కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలు మిన్నంటాయి.