ఆర్టీసి కార్మికుల మరో వినూత్న నిరసన..! 19న తెలంగాణలో సడక్ బంద్..!!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉదృతంగా సాగుతోంది. ఓ పక్క ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు తన పట్టు వీడడంలేదు. సమ్మె విషయంలో కార్మికులు మెట్టు దిగిరావాలని సీఎం గతంలో విజ్ఞప్తి కూడా చేసారు. మరో పక్క ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను విరమించడం లేదు. చలో ట్యాంక్ బండ్ ను నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ అందుకు తగ్గట్టుగానే భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటోంది. ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకులు కార్మిక లోకానికి భరోసాగా నిలవాలని అశ్వత్తామరెడ్డి కాంక్షిచారు.
ఉద్యోగులు చేస్తున్న సమ్మె వల్ల తప్పకుండా న్యాయం జరుగుతుందని, ఈలోపు ఎవ్వరూ అఘాయిత్యాలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఈ నెల 19న రహదారులను దిగ్బందించే కార్యక్రమం సడక్ బంద్ నిర్వహించనున్నట్టు అశ్వత్తామరెడ్డి తెలిపారు.కాగా తెలంగాణలో గత 41రోజులుగా జరుగుతున్న ఆర్టీసి సమ్మె పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం విచారకరమన్నారు అశ్వత్తామరెడ్డి. అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారం సరిగా లేదని అన్నారు.
అంతే కాకుండా తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం పట్ల ప్రభత్వం వ్యవహరిస్తున్న తీరును ఢిల్లీ వరకు తీసుకెళ్తామని అశ్వత్తామరెడ్డి స్పష్టం చేసారు. గరువారం నాడు ఢిల్లీలో మానవహక్కుల కమిషన్ ను, మహిళా కమిషన్ ను కలుస్తామన్నారు. ఆ తర్వాత పోలీసుల అణచివేత ధోరణి, ప్రభుత్వ వేధింపులపై కార్యచరణ రూపొందించుకుంటామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పై ఒత్తిడి తీసుకువచ్చి చర్చలు జరిపేలా కృషి చేయాలని అశ్వత్తామరెడ్డి పిలుపునిచ్చారు.