నెత్తిన పిడుగేసినట్లే!: ఉన్నపళంగా పీకేశారు.. 'ఫేక్ ఐటీ కంపెనీ' ఘరానా మోసం
కెరీర్ బీజ్ కన్సెల్టెన్సీ-లియోనసీ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలు 30మందికి కుచ్చు టోపీ పెట్టాయి.
హైదరాబాద్: మొన్నటికి మొన్న రిచీస్ ఇన్ఫీ టెక్.. ఇప్పుడు లియోనసీ సాఫ్ట్వేర్.. రాజధాని హైదరాబాద్లో నకిలీ ఐటీ కంపెనీల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కెరీర్ బీజ్ అనే కన్సెల్టెన్సీ-లియోనసీ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కలిసి 30మందికి కుచ్చు టోపీ పెట్టడంతో ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఎత్తేశారు: బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ, లబోదిబోమంటున్న ఉద్యోగులు..
పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలిస్తామని చెప్పి.. తామే సృష్టించిన ఓ నకిలీ ఐటీ కంపెనీలో ఇంటర్వ్యూలు కూడా జరిపారు. ఆపై ఉద్యోగం కావాలంటే రూ.1లక్ష సమర్పించుకోవాల్సిందేనని షరతు పెట్టారు. అలా చాలామంది నుంచి లక్షల్లో డబ్బు గుంజారు. తీరా అక్కడ చేరాక కానీ అసలు విషయం తెలియలేదు.
సాఫ్ట్ వేర్ అల్లుడా?.. వద్దు బాబోయ్: కాలం మారింది.. ఐటీ 'కళ' చెదిరింది
ఫేక్ కన్సల్టెన్సీ:
ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం, శాంతినగర్కు చెందిన గోరంట్ల రవికుమార్, కృష్ణాజిల్లా ఈకొండుర్ మండలం చిమలపాడు నివాసి సిరిమల్ల రామకృష్ణ స్నేహితులు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పంజాగుట్టలో కెరీర్ బీజ్ కన్సల్టెన్సీ నిర్వాహిస్తున్న ప్రణీత్ రెడ్డితో వీరు జతకట్టారు.నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టి డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయ్యారు.
లియోనసీ సాఫ్ట్ వేర్ ప్రై.లి.:
ముందుగా అనుకున్నట్లే మాదాపూర్లోని సర్వే నంబర్ 89లో లియోనసీ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ ప్రారంభించారు. తన కన్సల్టెన్సీలో ఇంటర్వ్యూలకు వచ్చే నిరుద్యోగులకు బ్యాక్ డోర్ తర్వాత జాబ్స్ ఇప్పిస్తానని ప్రణీత్ రెడ్డి నమ్మించేవాడు. ఇందుకు గాను రూ.50వేల నుంచి రూ.1లక్ష వరకు వారి నుంచి డబ్బు గుంజేవాడు. ఆపై వారిని ఫేక్ సంస్థ అయిన లియోనసీ సాఫ్ట్వేర్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్కు పంపేవాడు.
బడా కంపెనీల తరహాలోనే..:
కన్సల్టెన్సీ ద్వారా వచ్చిన అభ్యర్థులను రామకృష్ణారెడ్డి, గోరంట్ల రవికుమార్ బడా కంపెనీలకు ఏమాత్రం తగ్గకుండా ఇంటర్వూలు చేశారు. అయితే ఉద్యోగం కావాలంటే రూ.1లక్ష సమర్పించుకోవాల్సిందేనని షరతు పెట్టారు. విదేశాల నుంచి చాలా ప్రాజెక్టులు వస్తాయని, కొలువుకు ఎలాంటి ఢోకా ఉండదని భరోసా ఇచ్చారు. నమ్మకంతో చాలామంది నిరుద్యోగులు డబ్బులు సమర్పించుకున్నారు.
ఇదీ మెలిక, పిడుగు లాంటి వార్త:
డబ్బులు కట్టించుకున్న తర్వాత.. 'మూడు నెలలు జావా శిక్షణ ఇస్తామని, అందులో అర్హత సాధిస్తేనే ఉద్యోగం గ్యారెంటీ' అని మరో పిడుగు లాంటి వార్త చెప్పారు. మూడు నెలల తర్వాత పూర్ పెర్ఫామెన్స్ సాకుతో ఏకంగా ఉద్యోగాల నుంచి తీసేసి షాక్ ఇచ్చారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వనస్థలిపురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
ఈజీ మనీ కోసం:
సాఫ్ట్ వేర్ రంగంలో విపరీతమైన ఒత్తిడి ఉండటంతో సులువుగా డబ్బు సంపాదించే మార్గాలు ఎంచుకోవాలనుకున్నారు. ఇందుకోసం నిరుద్యోగులను మోసం చేయడమే కరెక్ట్ అనుకుని, ఓ ఫేక్ సాఫ్ట్ వేర్ కంపెనీని సృష్టించారు. కెరీర్ బీజ్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ప్రణీత్రెడ్డితో జతకట్టి నిరుద్యోగులు తమ కంపెనీకి వచ్చేలా చేసుకున్నారు.
మాదాపూర్లో ఒక గది, కంప్యూటర్లను అద్దెకు తీసుకుని ఎంపికచేసిన అభ్యర్థులకు మూడు నెలలు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత నైపుణ్యం లేదని అర్ధాంతరంగా తొలగించారు. దీంతో ఫేక్ కంపెనీ బాగోతం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాచకొండ ఎస్.వో.టి ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు.