టీటీడిపి నుండి మరో కీలక వికెట్ ఔట్..! గులాబీ గూటికి చేరనున్న నామా..!!?
ఖమ్మం/హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు పార్టీకి, పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాబట్టి నామా టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు ఖమ్మం నుండి తమ అభ్యర్థిని ప్రకటించని విషయం గమనార్హం. కాగా నామా నాగేశ్వర్ రావు ఖచ్చితంగా అధికార పార్టీలో చేరుతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీలోకి రావాల్సిందిగా నామాను కోరింది. ఈ పరిస్థితుల్లో నామా తీసుకునే నిర్ణయం పై ఖమ్మంలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆ పార్టీని వీడారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి, పొలిట్ బ్యూరో సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి తరఫున నామా పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు.
ఇవే నిదర్శనం!: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, కేటీఆర్కు లైన్ క్లియర్ చేస్తున్నారా?
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మనుగడ లేదని భావించిన ఆయన అటు కాంగ్రెస్లో గానీ, అదికార గులాబీ పార్టీలో గానీ చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆయన టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు , ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తోనూ భేటీ అయ్యారు. దీంతో నామా అదికార పార్టీలో చేరిక ఖాయమని తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం ఎంపీగా ఆయనను బరిలోకి దింపాలని గులాబీ పార్టీ సమాలోచనలు జరుపుతోంది.