మావోయిస్టు పార్టీలో మరో సంచలనం - గణపతి బాటలో మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు? - తెలంగాణ సేఫ్!
నిషేధిత భారత కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్టు)కు సంబంధించి ఒక్కొక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీ ఏర్పడినప్పటి నుంచి 14ఏళ్లపాటు సారధ్య బాధ్యతలు వహించిన ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి ప్రభుత్వానికి లొంగిపోనున్నట్లు వెల్లడైన కొద్దిగంటలకే మరో అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి కూడా లొగుబాటుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
మావోయిస్టు గణపతి లొంగుబాటుకు పోలీసుల సహకారం - కేసీఆర్ దగ్గరి వ్యక్తుల ద్వారా మంతనాలు?
ఇద్దరూ కలిసే వస్తారా?
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నట్లుగా ప్రముఖ మీడియా సంస్థల్లో బుధవారం వార్తలు వచ్చాయి. మల్లోజుల లొంగుబాటుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలంగాణ పోలీసుల వద్ద ఉందని, కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావుతోపాటే వేణుగోపాల్ కూడా లొంగిపోయేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కథనాల్లో పేర్కొన్నారు.
సోదరుడు కిషన్ జీ.. భార్య తారక్క
మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంలో పనిచేసిన కిషన్జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావుకు వేణుగోపాల్ తమ్ముడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లికి చెందిన ఈ ఇద్దరూ 70వ దశకంలో పీపుల్స్ వార్ గ్రూప్ ద్వారా విప్లవోద్యమంలోకి ప్రవేశించారు. 2011లో ఎన్కౌంటర్లో కిషన్జీ మృతి చెందిన తర్వాత వేణుగోపాల్ను పశ్చిమ బెంగాల్లోని ఆపరేషన్ గ్రీన్హంట్కు వ్యతిరేకంగా జరుగుతున్న లాల్గఢ్ ఉద్యమానికి నాయకునిగా నియమించారు.
అందుకే లొంగుబాటు..
మహారాష్ట్రంలోని గడ్చిరోలి మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో చెరుకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తర్వాత వేణుగోపాల్ మావోయి స్టు పార్టీ అధికార ప్రతినిధిగా నియమితుడయ్యారు. పార్టీ ప్రచురణల వి భాగంలోనూ బాధ్యతలు నిర్వహించారు. 2010లో దంతెవాడ ఘటనలో 70 మందికిపైగా సీఆర్పీఎఫ్ బలగాలు మృతి చెందడం వెనక వేణుగోపాల్ ప్రమేయం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 2018, డిసెంబర్ 4న జరిగిన ఎన్ కౌంటర్ లో వేణుగోపాల్ భార్య తారక్క చనిపోయారు. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఆయన.. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఛత్తీస్ వద్దు.. తెలంగాణే ముద్దు..
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు లొంగుబాటుకు సిద్ధమైన మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ పోలీసుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఛత్తీస్ గఢ్ లో లొంగిపోతే తర్వాతి కాలంలో వేధింపులు, ప్రతికారచర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, తెలంగాణలో తొలి నుంచీ అలాంటి పరిస్థితులు లేకపోవడంతో, తెలంగాణే సేఫ్ అని, ఇక్కడే లొంగిపోవాలని మావోయిస్టు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గణపతి, వేణుగోపాల్ లాంటి అగ్రనాయకుల నుంచి సాధారణ కార్యకర్తదాకా మావోయిస్టులు ఎవరు లొంగిపోయేందుకు ముందుకొచ్చినా పూర్తిగా సహకరిస్తామని, పునరావాసం కల్పిస్తామని తెలంగాణ పోలీసులు పదే పదే భరోసా ఇస్తుండటం తెలిసిందే.