మరో మైనర్ బాలికపై దారుణం .. ఆరునెలల గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు పరారీ
ఏం మారలేదు. ఏ రాష్ట్రంలో చూసినా, మారుమూల ప్రాంతాల్లో చూసినా కామాంధుల పైశాచికత్వానికి మైనర్ బాలికలు బలైపోతూనే ఉన్నారు. అనునిత్యం మైనర్ బాలికలపై లైంగిక హింస జరుగుతూనే ఉంది. మాయమాటలు చెప్పి మైనర్ బాలికలను లోబరుచుకుని అభం శుభం తెలియని ఆ చిన్నారులను గర్భవతులుగా మారుస్తున్న సంఘటనలు సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి.చిన్నారుల భవిష్యత్తు అంధకారమయం చేస్తున్నాయి.
అత్యాచార భారతం .. నాలుగేళ్ల చిన్నారిపై , 10ఏళ్ళ బాలికపై లైంగిక దాడి
మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ..గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు
ఉట్నూరు మండల కేంద్రంలో జరిగిన దారుణం బాలికలకు రక్షణ లేదు అనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. ఓ మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దపొర్ల గ్రామానికి చెందిన మైనర్ బాలిక చదువు మధ్యలో మానేసి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సదురు బాలికను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు బాలిక పెళ్లి చేసుకోవాలని కోరగా సదరు వ్యక్తి నిరాకరించాడు.
ప్రస్తుతం బాలిక ఆరునెలల గర్భవతి ... కేసు నమోదు , పరారైన కామాంధుడు
బాలిక అనారోగ్యంతో బాధపడుతుండటంతో , అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. బాలిక గర్భం దాల్చిన విషయం ఇంట్లో చెప్పలేదు. తీరా వైద్య పరీక్షల అనంతరం ఆ బాలిక ఆరు నెలల గర్భవతి అని తేలింది. సోమవారం సాయంత్రం గ్రామస్థులు చైల్డ్ లైన్కు సమాచారం అందించటంతో వారు బాలికను గర్భవతిని చేసిన కామాంధుడి పై ఫిర్యాదు చేశారు. బాలికను విచారించిన అధికారులు బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సదరు ప్రబుద్ధుడు గ్రామం నుంచి పరారయ్యాడు . పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.