కాంగ్రెస్ పార్టీలో కొత్తగా మరో అసమ్మతి నేత...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు బాధకలిగిస్తున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ వ్యవహారశైలితో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాగూర్ చేతిలో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్లుగా లేదని.. రేవంత్ రెడ్డి చేతిలోనే ఠాగూర్ పనిచేస్తున్నట్లుగా ఉందని శశిధర్ రెడ్డి అన్నారు. వీరు రాహుల్ గాంధీకి తప్పుడు నివేదికలిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో ఏం జరుగుతుందో అధిష్టానానికి తెలియనీయడంలేదని, తమ ఆవేదనంతా అడవి కాచిన వెన్నెల చందంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని కలిసి సమస్యలు చెప్పినప్పుడు ప్రత్యేకంగా ఒక మెకానిజం ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఆ విషయం చెప్పి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవకు అతీగతీ లేదని ధ్వజమెత్తారు. పార్టీలో చేరికలకు సంబంధించి ప్రత్యేకంగా జానారెడ్డి అధ్యక్షతన కమిటీ ఉన్నా.. అది ఈగలు తోలుకోవాల్సి వస్తోందన్నారు. కిందిస్థాయిలో పార్టీ నాయకులతో సమన్వయం లేకుండా ఏకపక్షంగా చేరికలు జరుగుతుండటంతో గ్రూపిజం పెరుగుతోందని, తద్వారా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్ లో నేతలంతా ఎవరికివారుగా చీలిపోయి ఎవరిష్టానుసారం వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక నేతతో మరో నేతకు సంబంధం ఉండటంలేదు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకునే వాతావరణమే కనిపిస్తోంది. ఈ తరుణంలో అధిష్టానమే జోక్యం చేసుకొని రాష్ట్రవ్యవహారాలను చక్కదిద్దాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.