ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మరో ఆర్టీసి కార్మికుడు .. ఆత్మహత్యల బాటలో ఆర్టీసీ కార్మికులు?
ఆర్టీసీ కార్మికులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వ అణచివేత కు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలకు సిద్ధమవుతున్నారు. నిన్నటికి నిన్న డి ఆర్ డి ఓ అపోలో ఆసుపత్రిలో ఖమ్మంలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్ రెడ్డి కన్నుమూయగా, హైదరాబాదులో కండక్టర్ సురేందర్ గౌడ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక నర్సంపేటలో మరో డ్రైవర్ ఆత్మహత్య యత్నం చేయబోయారు.
సీఎం తీరుతో కార్మికుల్లో మనోవేదన
ఆర్టీసీ కార్మికులు మనోవేదనతో ప్రాణత్యాగాలకు సిద్ధమవుతున్న పట్టింపులేని ప్రభుత్వ వైఖరి అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఏపీలో చేసిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పది రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న, పలు రూపాల్లో తమ ఆవేదన ప్రభుత్వానికి విన్నవించుకున్నా ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తుంది. ఆర్టీసీ సమ్మె లో ఆవేదన భరిత ఘట్టాలు ఎన్నో చోటు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ మాత్రం స్పందించిన దాఖలాలు లేవు.
ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇంతకింతకూ ఉద్రిక్తంగా మారుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి రోజు కూడా గడవకముందే హైదరాబాద్లో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్ కుల్సుంపురాలో కండక్టర్ సురేందర్గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాణిగంజ్ డిపోలోసురేందర్గౌడ్ కండక్టర్గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల నుంచి తొలగిస్తామని తీసుకున్న నిర్ణయం, దానికి సంబంధించి పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ ఈ నేపథ్యంలో మనస్థాపం చెందిన సురేందర్ గౌడ్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నర్సంపేటలో ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్
ఇక నర్సంపేట లోనూ రవి అనే ఆర్టీసీ డ్రైవర్ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తోటి కార్మికులు, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కార్మికులు మృత్యువాత పడుతున్న, ప్రాణాలను తీసుకుంటున్నా సీఎం కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్తున్నారు. 48 వేల మంది కుటుంబాలను రోడ్డున పడేసి ఆ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వారిని నియమించాలని నిర్ణయం తీసుకోవడంతో దిక్కు తోచని స్థితిలో ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలకు సిద్ధమవుతున్నారు.దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు .. ప్రభుత్వ హత్యలే అంటున్న ప్రతిపక్షాలు
కార్మికులు వరుసగా ఆత్మహత్యల బాట పడుతుంటే ఆందోళన వ్యక్తం చేస్తున్న విపక్షాలు ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి సాధించుకుందాం అని పిలుపునిస్తున్నారు. అంతేకాదు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి మరణంతో ఖమ్మం రీజియన్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇటు హైదరాబాద్ లోను సురేందర్ గౌడ్ మృతితో ఆర్టీసీ కార్మికులలో ఆందోళన నెలకొంది. ఇక ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిరసనగా , సమ్మెను ఉధృతం చేస్తున్నట్టు గా ప్రకటించిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఈనెల 19వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. శ్రీనివాస్ రెడ్డి మృతి నేపథ్యంలో నేడు ఖమ్మం జిల్లాలో బంద్ పాటించనున్నారు.