కేసీఆర్ తనయ కవితకు మరో షాక్ .. ఈ సారి తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘం నాయకుల వంతు
Recommended Video
తెలంగాణాలో గత పార్లమెంట్ ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ కుమార్తె కవితకు ఊహించని షాక్ ఇచ్చాయి. ఇక అప్పటినుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కవిత . తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టిఆర్ఎస్ పార్టీ, ఊహించని విధంగా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమైనటువంటి స్థానాలు బిజెపి, కాంగ్రెస్ లకు అప్పజెప్పింది. అందులో కెసిఆర్ కూతురు కవిత పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉంది. ఇక తాజాగా బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కూడా షాక్ ఇవ్వటానికి రెడీ అయిపోయారు.
కవిత ఇలాకాలో టీఆర్ఎస్ కు షాక్ ఇస్తున్న నాయకులు
పసుపు గిట్టుబాటు ధర కోసం అక్కడి రైతులు చేసిన పోరాటం తో, రైతులు ఎన్నికల బరిలోకి దిగడంతో కల్వకుంట్ల కవిత ఘోర పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ జిల్లాలో దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. బిజెపి నుండి అక్కడ ధర్మపురి అరవింద్ విజయకేతనం ఎగురవేసి ప్రస్తుతం బీజేపీని బలపరిచే పనిలో ఉన్నాడు. ఇదే సమయంలో అక్కడ తాజాగా ఎమ్మెల్యే షకీల్ టీఆర్ఎస్ పట్ల అసమ్మతి గళం వినిపించి ఎంపీ అరవింద్ ను కలిశారు .
టీజీబీకేఎస్ నేతల మధ్య చీలిక .. భారతీయ మజ్దూర్ సంఘ్లో చేరే ఆలోచనలో కీలక నేత
తాను గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఇంతా జరుగుతున్నా కవిత మాత్రం సైలెంట్ గా తండ్రి తనకు కీలక బాధ్యత ఏదైనా అప్ప చెప్తారని చూస్తోంది. ఇక ఇదే సమయంలో టిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఏర్పడిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీజీబీకేఎస్)లో కూడా నేతల మధ్య చీలిక వచ్చింది. టీబీజీకేఎస్ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన నాయకుడు కెంగెర్ల మల్లయ్య ఈ టిబిజికెఎస్ ని వీడి త్వరలోనే బీజేపీ కి సంబందించిన భారతీయ మజ్దూర్ సంఘ్లో చేరనున్నారని సమాచారం.
తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితకు షాక్
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే ఆయన భారతీయ మజ్దూర్ సంఘ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈమేరకు అన్ని పనులు చేసిన ఆయన, అధికారికంగా మరికొద్ది రోజుల్లో ఈ విషయాన్ని వెల్లడించనున్నారు. ఇక ఈ వార్త సైతం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కల్వకుంట్ల కవితకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. తెలంగాణలో సింగరేణి ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో కీలక భూమిక పోషించేది బొగ్గుగని కార్మికులే.
ఎన్నికల్లో కీలక భూమిక పోషించే బొగ్గు గని కార్మికులు
ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు బొగ్గుగని కార్మికులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటాయి. సింగరేణి కార్మికులు తల్చుకుంటే మాత్రం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూడా తమ ప్రభావాన్ని చూపించగలరని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఈ మేరకు పెద్దపెల్లి పరిధిలోకి వచ్చే 7 ముఖ్యమైన ప్రాంతాల్లో దాదాపుగా 19 వేలమంది కార్మికులు ఉన్నారు. కాగా ఈ కార్మికులు మాత్రమే కాకుండా వారి కుటుంబాలు కూడా ఎన్నికల్లో ప్రభావితం అవుతారని తెలుస్తుంది.
టిబిజికెఎస్ లో ప్రాధాన్యత లేదనే నిర్ణయం .. కవిత రంగంలోకి దిగుతారా ?
ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వీరికి తగినంత ప్రాధాన్యత లభించని కారణంగా వీరు అసంతృప్తిలో ఉన్నారని, అందుకనే పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారని సమాచారం. ఒకవేళ నిజంగానే కెంగర్ల మల్లయ్య ఇలా టిబిజికెఎస్ కి గుడ్ బై చెబితే మాత్రం నిజంగానే బొగ్గుగని కార్మిక సంఘం లో పెద్ద చీలిక వస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే బిజెపికి మరింత గట్టి మద్దతు సింగరేణి కార్మికుల నుండి లభించనుంది. ఇది కవితమ్మకు ఊహించని షాక్ .. మరి ఇప్పటికైనా ఆమె రంగంలోకి దిగి అసంతృప్త నాయకులను బుజ్జగిస్తారా అన్నది అనుమానమే .