గౌతమీపుత్ర శాతకర్ణి - కొత్త కోణం: 'అసలు'పై చర్చ
ప్రముఖ నటుడు బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా గురించి తెలుగు రాష్ట్రాలలో కొత్త చర్చ సాగుతోంది.
హైదరాబాద్: ప్రముఖ నటుడు బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా గురించి తెలుగు రాష్ట్రాలలో కొత్త చర్చ సాగుతోంది. గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభమైందని, అప్పటి నుంచే తెలుగువారు ఉగాది పండుగను జరుపుకోవడం మొదలైందని ఈ చిత్రంలో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
అంతేకాదు, శాలివాహన శకం గౌతమీపుత్ర శాతకర్ణితోనే ప్రారంభమైందని పదేపదే చెబుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో, ఇతర పత్రికలలో వార్తలు వచ్చాయి. గౌతమీపుత్ర శాతకర్ణి వేరు, శాలివాహన శకం వేరు అని చెబుతున్నారు. ఇప్పుడు, ఇదే విషయం సాక్షిలో కథనం వచ్చింది. దీంతో ఇది మరింత చర్చనీయాంశమైంది.
బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ నేత. ఆయన నటించిన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. సాక్షి పత్రిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిది. దీంతో మిగతా వాటిల్లో కంటే సాక్షిలో రావడంతో రాజకీయ రంగు పులుముకుంది.
చిరంజీవి సినిమాపై చంద్రబాబు కుట్ర!: రాజకీయ రంగు.. నిజాలేమిటి?
సాక్షిలో వచ్చిన కథనం ప్రకారం.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సినిమాలో ఉంటే చరిత్రను వక్రీకరించినట్లేనని చెబుతున్నారు. చరిత్రను అందంగా తెరకెక్కించేందుకు వాస్తవానికి కాల్పనికతను జోడించవచ్చునని, కానీ వాస్తవాన్ని వక్రీకరించేలా అభూత కల్పనలు ఉండరాదంటున్నారు.
గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభమయిందనడం చారిత్రక తప్పిదమని, అసలు ఈ సినిమాకు, శాలివాహనుడికి సంబంధమే లేదని పేర్కొంటున్నారు.
ఆంధ్ర శాతవాహనుల వంశానికి చెందిన 25వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి అని, శాలివాహనుల వంశానికి చెందిన రాజు శాలివాహనుడు అని పేర్కొంటున్నారు.
'గౌతమీపుత్ర శాతకర్ణి': చంద్రబాబును బయటపడేసిన కేసీఆర్!
శాతకర్ణి కలియుగంలో 2,669 నుంచి 2694 వరకు అంటే క్రీస్తు పూర్వం 433 నుంచి 408 వరకు అంటే.. దాదాపు పాతికేళ్లు గిరివ్రజంను రాజధానిగా చేసుకొని దేశాన్ని పరిపాలించారని చెబుతున్నారు.
ఆ తర్వాత శాతకర్ణి చనిపోయాక దాదాపు 485 ఏళ్ల తర్వాత, అంటే క్రీస్తు శకం 78లో ప్రమర వంశానికి చెందిన శాలివాహనుడితో శాలివాహన శకం ప్రారంభమైందని, ఆయన ఉజ్జయినిని రాజధానిగా చేసుకొని భారత్ను పాలించారని పేర్కొన్నారు.
గిరివ్రజం ప్రస్తుతం బీహార్లో ఉండగా, ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. భారత దేశాన్ని పాలించిన రాజవంశాల్లో శాతకర్ణిది ఎనిమిదవ వంశం కాగా, శాలివాహనడుది పదవ వంశమని పేర్కొన్నారు. అలాంటప్పుడు శాతకర్ణితోనే శాలివాహనుల శకం ప్రారంభమైందని చెప్పడం ఏమిటంటున్నారు.
ఉగాది పండుగను దేశంలో ఒక్క తెలుగువారే జరుపుకోరని, కర్నాటక, మహారాష్ట్రలలోను జరుపుకుంటారని పేర్కొన్నారు. కలియుగం ప్రారంభానికే ముందు నుంచి ఉగాది పండుగను మనం జరుపుకుంటున్నట్లు చారిత్రక, ఇతిహాసిక ఆధారాలున్నాయని, కలియుగం నుంచి లెక్క వేసుకున్నా చంద్రమానం ప్రకారం ఈ దుర్ముఖి నామ సంవత్సరానికి కలియుగం ప్రారంభమై 5118 సంవత్సరాలు అని గుర్తు చేస్తున్నారు.
గౌతమీపుత్ర శాతకర్ణి పాలన కలియుగంలో 2669 ఏళ్ల నాడు ప్రారంభమైందంటే, ఆయన పాలనకన్నా దాదాపు 2500 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉగాది పండుగను ప్రజలు జరుపుకుంటున్నారని, అలాంటప్పుడు శాతకర్ణితో ఉగాది పండుగ ఎలా ప్రారంభమవుతుందని పేర్కొంది.
బాబు నుంచి కేంద్రం దాకా వెళ్లిన పవన్ కళ్యాణ్ 'ఫైట్': ఉద్ధానంలో ఎందుకిలా?
గౌతమీపుత్ర శాతకర్ణి, శాలివాహనుడు వేర్వేరు కాలానికి చెందిన రాజులే అయినప్పటికీ దేశభక్తి కలిగిన వీరులు అని, వీరిద్దరికి వీరోచిత చరిత్ర ఉందని, వీరిద్దరి పైనా వేర్వేరుగా చారిత్రక సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించే అవకాశముందని, ఇద్దరి చరిత్రను కలిపినట్లయిదే అది చరిత్రను వక్రీకరించినట్లేనని పేర్కొంది.
చరిత్రను వక్రీకరించకుండా ప్రయోగాలు చేయవచ్చునని, చరిత్ర ఏదో, కల్పన ఏదో ప్రేక్షకులకు తెలిసేలా ఉండాలన్నారు. తప్పుదారి పట్టించరాదని పేర్కొన్నారు.
గౌతమీపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభమైందని, ఉగాది పండుగ ప్రారంభమైందని చిత్రం ఆడియో విడుదల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య, హీరో బాలయ్య చెప్పారని, వారికి రాసిచ్చిన స్క్రిప్టులో లోపం ఉండవచ్చునని, కానీ సినిమాకు రాసిన స్క్రిప్టులో లోపం ఉంటే అది ఎంతమాత్రం గౌతమీపుత్ర శాతకర్ణి కాదని, క్రిష్ పుత్ర శాతకర్ణి అవుతుందని పేర్కొంది.
ఇదిలా ఉండగా, శాలివాహనుడు, శాతకర్ణుడు ఒకరా, వేర్వేరా అనే దానికి కచ్చితమైన, నిర్దిష్టమైన ఆధారాలు లేవని కూడా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఆడియో వేడుక సందర్భంగా దర్శకులు క్రిష్ కూడా ఈ విషయం స్పష్టంగా చెప్పారు.