తెర పైకి మరో లీకు.... మరో మావోయిస్టు అగ్ర నేత కటకం సుదర్శన్ కూడా లొంగిపోనున్నారా...?
సాయుధ బాటలో విప్లవాన్ని కాంక్షించి అడవి బాట పట్టి... మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది అగ్ర నేతలు వయోభారంతో లొంగుబాటుకు సిద్దమవుతున్నారన్న కథనాలు గత కొద్దిరోజులుగా జోరందుకున్నాయి. మొదట మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి(74) తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు లీకులు వచ్చాయి.
ఆ తర్వాత మరో మావో అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి కూడా లొంగిపోనున్నట్లు లీకులు వచ్చాయి. ఇదే బాటలో మావోయిస్ట్ పార్టీకి చెందిన మరో అగ్ర నేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ కూడా లొంగిపోనున్నారన్న కథనాలు తాజాగా తెర పైకి వచ్చాయి.
సుదర్శన్ నేపథ్యం
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 2013లో కాంగ్రెస్ నేతలపై మావోల దాడిలో 27 మంది మరణించారు. ఈ భారీ దాడి వెనుక వ్యూహకర్త కటకం సుదర్శన్. ఉత్తర తెలంగాణ నుంచి దండకారణ్యం వరకు మావోయిస్టు కార్యకలాపాల్లో సుదర్శన్ కీలకంగా పనిచేస్తూ వస్తున్నారు. ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లికి చెందిన సుదర్శన్ వరంగల్లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించారు. కొంతకాలం టీచర్గా కూడా పనిచేశారు. ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లా సీపీఐ(మావోయిస్టు) సెక్రటరీ సాధనను వివాహం చేసుకున్నారు.
42 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో..
1975-1979 ప్రాంతంలో విప్లవోద్యమానికి ప్రభావితమై సుదర్శన్ ఛత్తీస్గఢ్ వెళ్లిపోయారు. 42 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఆయన అంచెలంచెలుగా అగ్ర నేత స్థాయికి ఎదిగారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా,పొలిట్ బ్యూరో సభ్యుడిగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కిషన్జీ ఎన్కౌంటర్ తర్వాత సెంట్రల్ రీజినల్ బ్యూరో ఆఫ్ సీపీఐకి చీఫ్గా కూడా పనిచేశారు. సుదర్శన్ ఎన్నోసార్లు పోలీసుల ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్నారు.
పోలీసుల ఎదుట లొంగిపోయిన భార్య...
సుదర్శన్ తండ్రి మల్లయ్య 2017లో, తల్లి వెంకటమ్మ 2018లో మృతి చెందారు. భార్య సాధన కొన్నేళ్ల క్రితమే లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అయితే సుదర్శన్ మాత్రం మావోయిస్టు పార్టీలోనే కొనసాగుతున్నారు. అప్పట్లో ఒకసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సుదర్శన్... మావోయిస్టు కేంద్ర కమిటీలో 8 మంది అరెస్టయ్యారని,22 మందిని ప్రభుత్వం చంపించిందని చెప్పారు. సహచరులు ఎంతమందిని కోల్పోయినా... ఆయన మాత్రం సాయుధ పోరును వీడలేదు.
లీకుల్లో నిజమెంత...?
గత కొద్దిరోజులుగా మావోల లొంగుబాటుపై వస్తున్న లీకులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మావోయిస్టు పార్టీ అగ్ర నేతలంతా ఒక్కసారిగా బయటకు రావడం సాధ్యమయ్యే పనేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణ పోలీసులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఆసిఫాబాద్లో పర్యటించి అక్కడి పరిస్థితులపై సమీక్ష జరిపారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మావోల లొంగుబాటు హాట్ టాపిక్గా మారింది. లొంగిపోయే మావోయిస్టులకు పోలీసులు సహకరిస్తారా... లేక ఈ లీకులన్నీ ఊహాగానాలుగా మిగిలిపోతాయా అన్నది వేచి చూడాలి.