మళ్లీ వానలు.. రెండురోజులపాటు బీభత్సమే.. అలర్ట్గా ఉండాలన్న వాతావరణ శాఖ
హైదరాబాద్ : మరో రెండు, మూడురోజులు తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో గత కొద్దిరోజుల నుంచి ముసురు వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి, రెండురోజుల గ్యాప్ తర్వాత మళ్లీ వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నుంచి వర్ష బీభత్సం కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బెంగాల్ దక్షిణం, ఉత్తర ఒడిశాలో కేంద్రికృతమైంది. 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వచ్చే 48 గంటల్లో మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం చాలా ప్రాంతాల్లో .. గురువారం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్ర అధికారి రాజారావు తెలిపారు. మంగళవారం రాత్రి కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
తెలంగాణ, ఏపీలో మోస్తరు వర్షాలు కురుస్తోండగా ... కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో మాత్రం వర్ష బీభత్సం కొనాసాగుతుంది. కొండచరియలు విరిగిపడి ఇప్పటికే వందల సంఖ్యలో చనిపోయారు. మరోవైపు కర్ణాటకలో రూ.6 వేల కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు ఎగువన కురుస్తోన్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుతుంది. దీంతో తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి.