ఈ పాపం బోర్డుదే : మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి
హైదరాబాద్ : ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వారి ఏమరుపాటు ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితం అంధకారమవుతోంది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. మంగళవారం మరో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడి ... వారి కుటుంబాల్లో కడుపుకోతని మిగిల్చారు.
ఆరిన జ్యోతి
షాబాద్ మండలం తిరుమలాపూర్కు చెందిన జ్యోతి చేవెళ్ళలోని వివేకానంద జూనియర్ కాలేజీలో సీఈసీ రెండో సంవత్సరం చదువుతోంది. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సెకండియర్ సివిక్స్ పరీక్షలో ఫెయిల్ అయింది. తీవ్ర మనస్తాపం చెందిన జ్యోతి ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది.
మరో విద్యార్థి బలి
ఇటు వరంగల్ రూరల్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెక్కొండ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి తనువు చాలించారు. మృతున్ని నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన నవీన్గా గుర్తించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో నవీన్ ఆత్మహత్యకు పాల్పడట్టుగా తెలుస్తోంది.
హైకోర్టు సీరియస్
ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. విద్యార్థుల జీవితాలతో అడుకుంటారా అని బోర్డును ప్రశ్నించింది. రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ చేపట్టాలని స్పష్టంచేసింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన జ్యుడీషియల్ విచారణతో విద్యార్థులకు న్యాయం జరగదని హైకోర్టు అభిప్రాయపడింది.