గ్రేటర్ ఫలితాల ఎఫెక్ట్: టిడిపికి మరో ఇద్దరు ఎమ్మెల్యేల షాక్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి రాబోయే ఆగిపోయిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. టిడిపి నుంచి తెరాసలోకి దూకడానికి వారు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. దానికితోడు, కాపు రిజర్వేషన్ల వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఎల్బీనగర్ టిడిపి ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కూడా టిడిపికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
గ్రేటర్ పలితాల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు వివేకానంద తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తెరాసలో చేరి నియోజకవర్గం బాధ్యతలు చూసుకుని వచ్చే ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవడమే మంచిదనే యోచలో ఆయన పడినట్లు చెబుతున్నారు
గత శాసనసభ ఎన్నికల్లో టిడిపి గ్రేటర్ పరిధిలోని 24 సీట్లలో 9 సీట్లు గెలుచుకుంది. టిడిపి నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్నలు పార్టీని వీడి తెరాసలో చేరారు. వారు పార్టీని వీడినప్పటికీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు, సీమాంధ్ర ఓటర్లు తమ వైపే ఉన్నారని, ఆ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో తామే గెలుస్తామని టిడిపి నేతలు నమ్ముతూ వచ్చారు.
కానీ, ఆ స్థానాల్లోని డివిజన్లలోనూ టిడిపి బొక్క బోర్లా పడింది. సీమాంధ్ర ఓటర్లు టిడిపి వైపు ఉంటారనే భ్రమ కూడా తొలగిపోయింది. దీంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తమ రాజకీయ భవిష్యత్తును చూసుకునే దిశలో అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
టిడిపి నుంచి గెలిచిన రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు తెరాసలో చేరుతారనే ప్రచారం జరిగినా టిడిపిలోనే ఉండిపోయారు. తాజా ఫలితాల నేపథ్యంలో వారు కూడా పునరాలోచనలో పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఆర్. కృష్ణయ్య కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే చంద్రబాబు ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడడం సరి కాదనే ఉద్దేశంతో ఆయన పార్టీకి రాజీనామా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఏమైనా, టిడిపిని గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు తిరుగులేని దెబ్బ తీశాయి.