కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణే తెలంగాణ జనసమితి లక్ష్యం..!!
తెలంగాణ జనసమితి పార్టీ రాబోవు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ లో భాగంగా భావసారూప్యత ఉన్న పార్టీలన్నీ ఏక తాటిమీదకు రాబోతున్నాయి. అందుకు జనసమితి క్రియాశీల పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమే లక్ష్యంగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని జనసమితి పిలుపునిచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణ సాదించుకున్నప్పటికి ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయకపోవడంతో సమాజంలో వ్యత్యాసాలు ఏర్పడే ప్రమాదం ఉందని తెలంగాణ జనసమితి విశ్వసిస్తోంది.
తెలంగాణలో సమన్యాయమే లక్ష్యం..! ప్రత్యామ్నాయ ప్రభుత్వమే జనసమితి ద్యేయం..!!
తెలంగాణ జన సమితి తెలంగాణలోని రాజకీయ పార్టీల కూటమికి ఒక వేదిక కాబోతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి టీజేఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఎలాగూ కాంగ్రెస్ వ్యూహం కూడా ఇదే కావడంతో టీజేఎస్, కాంగ్రెస్ల మధ్య పొత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. అంతే కాకుండా కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జన సమితితో కలిసి అడుగులు వేయడం కోసం పలు పార్టీలు ఎదురు ఆసక్తి చూపిస్తున్నాయి. టీజేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో ఈ మధ్య తెలంగాణ జన సమితి తెరమీదకు వచ్చింది.
భావసారూప్యత గల పార్టీలతో భాయి భాయి కి జనసమితి సై..!
టీఆర్ఎస్ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా కోదండరాం టీజేఎస్ను ఏర్పాటు చేశారు. తమ ఒక్కరితోనే అది సాధ్యంకాదని .. కలిసొచ్చే పార్టీలతో రాజకీయ లక్ష్యాన్ని సాధిస్తామని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీచేయబోమని ఆపార్టీ వర్గాలు స్పష్టపరుస్తున్నాయి. అంటే పొత్తు దిశగా టీజేఎస్ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్తో టీజేఎస్ నాయకత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ను అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పనిచేయాలని నిర్ణయించారు. అన్ని పార్టీలు విడివిడిగా పోటీచేస్తే టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలుతుందని..తద్వారా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్ శక్తులన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఒకవైపు టీజేఎస్, మరోవైపు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
టీఆర్ఎస్ ను ఓడించాలి.. ప్రణాళికలు సిద్దం చేస్తున్న కోదండరాం..
కొత్తగా పెట్టిన కోదండరాం పార్టీ తమకు కలిసోస్తుందా లేక నష్టం చేకూరుస్తుందా అనే దానిపై ఇప్పటికే కాంగ్రెస్లో లోతైన విశ్లేషణలు జరిగాయి. పార్టీ అధిష్టానం సైతం ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను తెలుకుంటోంది. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను దూరం చేసుకోకుండా సంప్రదింపులు జరపాలని అధిష్టానం నుంచి ఉత్తమ్కుమార్ రెడ్డికి సూచనలు అందుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఉత్తమ్ కుమారే స్వయంగా కోదండరాంతో భేటీ అయినట్టు తెలుస్తోంది. కోదండరాం పార్టీ పెట్టడంతో ఓటుబ్యాంక్ చీలే అవకాశం ఉందని, అది అంతిమంగా అధికారపార్టీకే లాభిస్తుందని కోదండకు ఉత్తమ్ సూచించినట్టు సమాచారం. యువత, విద్యార్థులు, జేఏసీ నేతలు తనపై తీవ్ర ఒత్తిడి తేవడంతోనే పార్టీ పెట్టాల్సి వచ్చిందని కోదండరాం ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది.
కోదండరాంకు జై కొడుతున్న పార్టీలు.. ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు..
టీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న ఒక సామాజిక వర్గం సైతం కాంగ్రెస్, టీజేఎస్లకు మద్దతు పలికే అవకాశం ఉంది. ఇప్పటికే అధికార పార్టీకి వ్యతిరేకంగా సీపీఐ కూడా వీరికి మద్దుతు ప్రకటించింది. ఇక సీపీఎం, ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రకటించింది. బీఎల్ఎఫ్తోనే పోటీ చేస్తామని చెబుతోంది. సీపీఎం - బీఎల్ఎఫ్పైనా కోదండరాం - ఉత్తమ్ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే పొత్తులపై ఎన్నికల నాటికి స్పష్టత రావచ్చని కోదండరాం అనడంతో చర్చల ప్రక్రియకు ప్రస్తుతం తాత్కాలిక తెర పడింది. రాహుల్ తెలంగాణ పర్యటన తర్వాత పొత్తుల పై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.