అనూష హత్య: ప్రియుడే హంతకుడు, కక్ష పెంచుకుని..
Recommended Video
హైదరాబాద్: తీవ్ర సంచలనం సృష్టించిన బిటెక్ గ్రాడ్యుయేట్ అనూష హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడే ఆమెను బండరాయితో మోది చంపాడని తేలింది. హైదరాబాదులోని హయత్ నగర్ సమీపంలో ఇటీవల అనూష హత్య జరిగిన విషయం తెలిసిందే.
అనూష తల్లిదండ్రులు అనుమానించినట్లుగానే ఆమె ప్రియుడు మోతీలాల్ ఈ హత్యకు పాల్పడ్డాడు. ఆమెపై అనుమానం పెంచుకున్న నాగర్ కర్నూలుకు చెందిన మోతీలాల్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మోతీలాల్ను పోలీసులు అరెస్టు చేశారు.
తొమ్మిది నెలల క్రితం నిశ్చితార్థం
మోతీలాల్, అనూష ప్రేమించుకున్నారు. తొమ్మిది నెలల క్రితం నిశ్చితార్థం కూడా కుదిరింది. అయితే, కుటుంబ కలహాల కారణంగా పెళ్లి రద్దయింది. దానికితోడు, తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని అనూష నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమె హత్యకు గురైంది.
ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటూ..
నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని కొండాభీమ్ పల్లి గ్రామానికి చెందిన అనూష బిటెక్ పూర్తి చేసింది. తండ్రి లేడు. తల్లే ఆమెను చదివిస్తూ వచ్చింది. ఉద్యోగం కోసమని చెప్పి హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకుంటూ హయత్నగర్లో అక్కాబావలతో ఉంటోంది.
తల్లికి ఫోన్, అదే రోజు..
అనూష మిథాలినగర్లోని అక్కాబావల ఇంట్లో ఉంటూ వచ్చింది. అక్కాబావ మరో ప్రాంతానికి వెళ్లారు. శుక్రవారం ఇంటికి వస్తానని తల్లితో పబ్లిక్ ఫోన్ నుండి కాల్ చేసి చెప్పింది. అయితే, తనకు ఓ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని మోతీలాల్ చెప్పి ఆ రోజు రాత్రి ఉండుమన్నాడని తల్లికి మరోమారు ఫోన్ చేసి చెప్పింది. అదే రోజు అనూష హత్యకు గురైంది ఆమె ఉంటున్న గది బయటి నుండి తాళం వేసి ఉండడమే కాకుండా లోపలి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హత్యతో మరో ముగ్గురి ప్రమేయం...
అనూష కుటుంబ సభ్యులు ఎల్బీనగర్లోని డిసిపి కార్యాలయం ముందు శనివారం ఆందోళనకు దిగారు. హత్యలో మరో ముగ్గురి ప్రమేయం ఉందని వారు ఆరోపిస్తున్నారు. హత్య జరిగే నాటికి ఆమె గర్భవతి అని కూడా చెబుతున్నారు. శవానికి రీపోస్టుమార్టం జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇలా చేసి పారిపోయాడు..
అనూషపై అనుమానంతోనే మోతీలాల్ హత్య చేశాడని పోలీసులు చెప్పారు. బండరాయితో మోది ఆమెను హత్య చేసిన తర్వాత సెల్ ఫోన్ స్విచాఫ్ చేసి అతను పారిపోయాడని చెప్పారు. కేసును అన్ని కోణాల నుంచి విచారిస్తున్నామని, అతనికి సహరించినవారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.